'గద్దర్ నాపై రివాల్వర్ ఎక్కుపెట్టి బెదిరించారు' | Gaddar attend tirumalagiri police station | Sakshi
Sakshi News home page

'గద్దర్ నాపై రివాల్వర్ ఎక్కుపెట్టి బెదిరించారు'

Mar 1 2014 10:25 AM | Updated on Sep 2 2017 4:14 AM

'గద్దర్ నాపై రివాల్వర్ ఎక్కుపెట్టి బెదిరించారు'

'గద్దర్ నాపై రివాల్వర్ ఎక్కుపెట్టి బెదిరించారు'

తనపై నమోదైన బెదిరింపుల కేసు విచారణలో భాగంగా ప్రజాగాయకుడు గద్దర్ శుక్రవారం తిరుమలగిరి పోలీసుస్టేషన్‌కు వచ్చారు.

బొల్లారం/తిరుమలగిరి: తనపై నమోదైన బెదిరింపుల కేసు విచారణలో భాగంగా ప్రజాగాయకుడు గద్దర్ శుక్రవారం తిరుమలగిరి పోలీసుస్టేషన్‌కు వచ్చారు. ఇన్‌స్పెక్టర్ రవికిరణ్ కథనం... కానాజీగూడకు చెందిన కంటోన్మెంట్ బోర్డు 7వ వార్డు బీజేపీ ప్రధాన కార్యదర్శి జె.ప్రశాంత్ అలియాస్ ప్రభును ఫిబ్రవరి 25న టీచర్స్ కాలనీ వద్ద గద్దర్, ఆయన గన్‌మెన్లు, కుమారుడు సూర్య కిరణ్, కె.రమేష్, ఖాసీం సాహేబ్, ఇంద్ర, సీఎల్ యాదగిరి అడ్డుకున్నారనేది ఆరోపణ.

గద్దర్ తనపై రివాల్వర్ ఎక్కుపెట్టి తన స్నేహితుడైన రవీందర్‌ను వెన్నెలతో విడాకులకు ఒప్పించాలని, అతడితో స్నేహం కొనసాగిస్తే చంపేస్తానని బెదిరించారని ప్రశాంత్ ఫిర్యాదు చేశారు. సూర్యకిరణ్ తనపై చేయి చేసుకున్నారని ఆరోపించారు. దీనిపై తిరుమలగిరి పోలీసులు 26న ఫిర్యాదు అందుకుని కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా శుక్రవారం గద్దర్, గన్‌మెన్ల వాంగ్మూలాలు రికార్డ్ చేశారు. ఉదంతం జరిగినట్లు చెప్తున్న రోజు, ఆ సమయంలో వీరంతా ఇంట్లోనే ఉన్నట్లు తేలిందని తెలిసింది. రవీందర్, వెన్నెల మధ్య విభేదాలే ఈ ఫిర్యాదుకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

నాపై కక్షగట్టే: ప్రశాంత్
గద్దర్ కుమార్తె ప్రేమ వివాహానికి సహకరించినందుకే నాపై ఆయన కక్ష కట్టారని ప్రశాంత్ అన్నారు. గద్దర్ తన కుటుంబ తగదాలను ఇతరులపై నెట్టివేస్తూ బలవంతపు కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. అతని అల్లుడు రవి..తాను చిన్ననాటి స్నేహితులం కావడంతో కలిసిమెలిసి ఉండేవారమన్నారు. ఇది మనసులో పెట్టుకొనే తనను చంపేస్తామని గద్దర్ బెదిరించారన్నారు. గద్దర్‌తో తనకు ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement