రోజుకో కొత్తముఖం | Freshly Another man was arrested .. | Sakshi
Sakshi News home page

రోజుకో కొత్తముఖం

Aug 24 2016 1:56 AM | Updated on Oct 9 2018 7:05 PM

రోజుకో కొత్తముఖం - Sakshi

రోజుకో కొత్తముఖం

వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో లెక్కలేనన్ని బాగోతాలు వెలుగు చూస్తున్నాయి.

సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో లెక్కలేనన్ని బాగోతాలు వెలుగు చూస్తున్నాయి. కేసు దర్యాప్తులో భాగంగా అనేక కొత్త ముఖాలు బయటపడుతున్నాయి. వీరందరూ దేశంలోని 12 రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో.. ఎంసెట్ మాఫియా చైన్ లింక్‌ను చూసి సీఐడీ అధికారులు నివ్వెరబోతున్నారు. ఇప్పటి వరకు నిందితుల జాబితా 54కు చేరగా, అరెస్టయిన వారి సంఖ్య 26కు చేరింది. వీరిలో తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్తాన్, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నిందితులున్నారు.

దీంతో సీఐడీ మరింత లోతుగా ఆరా తీస్తోంది. ఈ నిందితులంతా ఎలా కలిశారనే దానిపై దృష్టి సారించి మూలాలను ఛేదించే పనిలో నిమగ్నమైంది.

ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీల పేరుతో దగా..
ఎంసెట్-2ను దర్యాప్తు చేస్తున్న సీఐడీకి అనేక కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎంసెట్-1ను ఈ ఏడాది మే 2న నిర్వహించగా.. ఎంసెట్-2ను జూలై 9న నిర్వహించారు. 2 నెలల వ్యవధిలో నిర్వహించిన ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకవడం అది కూడా 12 రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల చేతికి వెళ్లడం అధికారులను విస్మయపరుస్తోంది. ఇప్పటి వరకు అరెస్టయిన వారంతా కూడా వివిధ చోట్ల ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీలనే నిర్వహిస్తున్నారు.

దీంతో విద్యాసంస్థల పేరుతో ఓ మాఫియా దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను లీక్ చేస్తున్నట్లు సీఐడీ అనుమానిస్తోంది. ఎంసెట్-2కు అతి తక్కువ సమయంలో 200 మందికి పైగా విద్యార్థులను సేకరించడం, వారిని నమ్మించి ‘ప్రత్యేక’ శిక్షణకు ఒప్పించడం అంత మామూలు విషయం కాదు. ఈ వ్యవస్థ ఎంత కాలం నుంచి ఎక్కడెక్కడ ఎలా పని చేస్తున్నదనే దానిపై సీఐడీ ఆరా తీస్తోంది.
 
తాజాగా మరో వ్యక్తి అరెస్టు..
ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో మరో వ్యక్తి అరెస్టయ్యాడు. తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న రాజేశ్ రాజశేఖర్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐడీ ఐజీ సౌమ్యా మిశ్రా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరుగురు విద్యార్థులను సమీకరించి కోల్‌కతాలో ఏర్పాటు చేసిన ‘ప్రత్యేక’ శిక్షణ శిబిరంలో నిందితుడు తర్ఫీదు ఇచ్చినట్లు దర్యాప్తులో వెలుగు చూసింది. కుంభకోణంలో మిగిలిన వారి పాత్రపై విచారణ చేస్తున్నామని, త్వరలో కీలక వ్యక్తులను అరెస్టు చేస్తామని సౌమ్యా మిశ్రా వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement