హాస్టల్ నుంచి మరో హాస్టల్‌పైకి దూకుతూ.. | Engineering student injured slip from hostel | Sakshi
Sakshi News home page

హాస్టల్ నుంచి మరో హాస్టల్‌పైకి దూకుతూ..

Dec 23 2015 2:44 AM | Updated on Sep 3 2017 2:24 PM

ఎల్లంకి సాయికిరణ్(19)

ఎల్లంకి సాయికిరణ్(19)

హైదరాబాద్ మైసమ్మగూడ ప్రాంతంలోని ఓ హాస్టల్ భవనం మూడో అంతస్తు నుంచి జారి పడి ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందాడు.

హైదరాబాద్: హైదరాబాద్ మైసమ్మగూడ ప్రాంతంలోని ఓ హాస్టల్ భవనం మూడో అంతస్తు నుంచి జారి పడి ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. ఖమ్మం జిల్లా జూలురుపాడుకు చెందిన ఎల్లంకి సాయికిరణ్(19) మైసమ్మగూడలోని నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫస్టియర్ చదువుతూ అదే ప్రాంతంలోని సాయి బాలాజీ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఆ హాస్టల్ భవనానికి ఆనుకొని అక్షయ హాస్టల్ కూడా ఉంది. విద్యార్థులు రెండు హాస్టల్ భవనాల నుంచి అటు ఇటూ దూకుతూ ఉంటారు.

ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం మరో బీటెక్ విద్యార్థి అవినాష్ బాలాజీ హాస్టల్ మూడో అంతస్తు నుంచి అక్షయ హాస్టల్‌కు వెళ్తుండగా సాయికిరణ్ వచ్చాడు. పక్క హాస్టల్‌లో ఉన్న మణిదీప్ వద్దకు వెళ్లి సెల్‌ఫోన్‌లో బుక్ మైషో యాప్‌లో సినిమా టికెట్లు బుక్ చేద్దామన్నాడు. సరేనని చెప్పి అవినాష్ అక్షయ హాస్టల్ భవనంలోకి దూకాడు. అతని వెంటే వస్తున్న సాయికిరణ్ కాలు జారి మూడో అంతస్తు నుంచి కిందకు పడిపోయాడు. దీంతో సాయికిరణ్ తల, ఛాతీ భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. సూరారంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement