విశాఖపట్నం: జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. ఆరిలోవ ఎస్ఐ కృష్ణ తెలిపిన వివరాలివి.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్పూర్కు చెందిన షాతక్షి రావు (23), ఆమె స్నేహితుడు చంద్రశేఖర్ మిశ్రా భువనేశ్వర్లోని కళింగ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నారు. కళాశాలకు సెలవులు కావడంతో వారిద్దరూ కలిసి సోమవారం విశాఖ పర్యటనకు వచ్చారు.
నగరంలో ఒక స్కూటీని అద్దెకు తీసుకుని, పీఎంపాలెం వైపు నుంచి జాతీయ రహదారిపై వస్తుండగా.. ఎండాడ – జూ పార్క్ మధ్యలో వెనుకనే వస్తున్న ఓ బస్సు వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీ వెనుక కూర్చున్న షాతక్షి రావు తలకు తీవ్ర గాయాలై, అధిక రక్తస్రావం కావడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న ఆరిలోవ ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై ఆరిలోవ లా అండ్ ఆర్డర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన బస్సును స్టేషన్కు తరలించి, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.


