మెట్రో అలైన్‌మెంట్ మార్చొద్దు | Dont change Metro alignment | Sakshi
Sakshi News home page

మెట్రో అలైన్‌మెంట్ మార్చొద్దు

Dec 21 2015 2:32 AM | Updated on Nov 9 2018 5:52 PM

మెట్రో అలైన్‌మెంట్ మార్చొద్దు - Sakshi

మెట్రో అలైన్‌మెంట్ మార్చొద్దు

పాతనగరంలో మెట్రో అలైన్‌మెంట్‌ను రాజకీయ కారణాలతో మార్పు చేయడం సరికాదని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు.

సాక్షి, హైదరాబాద్: పాతనగరంలో మెట్రో అలైన్‌మెంట్‌ను రాజకీయ కారణాలతో మార్పు చేయడం సరికాదని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ముందుగా నిర్ణయించిన మెట్రో మార్గం అయితే ఎక్కువ మంది ప్రయాణికులకు ఉపయుక్తంగా ఉం టుందని, ప్రభుత్వం మార్చాలనుకుంటున్న నూతన మార్గంలో రద్దీ తక్కువగా ఉంటుందన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయాలు చేయడం సరికాదని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని ఆయన సూచించారు. ఆదివారం పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, మెట్రోరైలు, ఎంఎంటీఎస్ రెండోదశపై ఆయన ఆయా విభాగాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మెట్రో తొలిదశ పథకాన్ని మియాపూర్-ఎస్.ఆర్ .నగర్ (12 కి.మీ), నాగోల్-మెట్టుగూడా (8కి.మీ) మార్గాల్లో వచ్చే ఏడాది జూన్‌లో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయన్నారు. పన్నెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎంఎంటీఎస్ రెండోదశ ప్రాజెక్టుకు బీజేపీ ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు. సుమారు రూ.820 కోట్ల అం చనా వ్యయంతో చేపట్టనున్న ఈ పథకానికి గతేడాది బడ్జెట్‌లో రూ.120 కోట్లు కేటాయిం చినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టును 2017 డిసెంబరు నాటికి పూర్తిచేస్తామని ప్రకటిం చారు. ఎంఎంటీఎస్ రెండోదశను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు పొడిగిస్తే ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు.

ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం, జీఎంఆర్, కేంద్ర పౌరవిమానయాన శాఖలు చర్చించి తక్షణం నిర్ణయం తీసుకోవాలన్నారు. రాబోయే బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు రూ. 200 కోట్ల నిధులు కోరినట్లు తెలిపారు. అలాగే, హైదరాబాద్‌లో ఏటా 9 శాతం మేర ట్రాఫిక్ పెరుగుతోందని, రోజురోజుకూ పెరుగుతోన్న ట్రాఫిక్ చిక్కులు, రవాణా పాలసీపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర అధ్యయనం జరిపి సమీకృత ప్రణాళిక సిద్ధం చేయాల్సిన అవసరం ఉందనిదత్తాత్రేయ అన్నారు. ఎంఎంటీఎస్ స్టేషన్ల నుంచి ఉన్న పలు రహదారులను రాష్ట్ర ప్రభుత్వం విస్తరించాలని సూచించారు.
 
 2016 మార్చి నాటికి పెద్దపల్లి-నిజామాబాద్ లైన్
 పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వే లైను 2016 మార్చి నాటికి పూర్తికానుందని దత్తాత్రేయ తెలిపారు. ఈ పథకాన్ని పూర్తిచేసేందుకు కేంద్ర రైల్వేశాఖ పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేసిందన్నారు. కాగా రూ. 500 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న కాచిగూడ-మహబూబ్‌నగర్ డబ్లింగ్ రైల్వే లైను పనులకు త్వరలో టెండర్లు ఖరారు చేస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement