అమ్మ చెప్పిందని పెళ్లి చేసుకున్నాడంట.. | Domestic Violence on judge's Son | Sakshi
Sakshi News home page

అమ్మ చెప్పిందని పెళ్లి చేసుకున్నాడంట..

Jun 17 2016 6:22 PM | Updated on Sep 4 2018 5:21 PM

‘అమ్మ చెప్పిందని నన్ను పెళ్లి చేసుకున్నాడంట నా భర్త...’ అంటూ ఓ యువతి కన్నీటిపర్యంతమైంది.

 ‘అమ్మ చెప్పిందని నన్ను పెళ్లి చేసుకున్నాడంట నా భర్త...’ అంటూ ఓ యువతి కన్నీటిపర్యంతమైంది. పెళ్లయి ఏడాదైనా ఒక్కసారి కూడా తనను భార్యగా స్వీకరించలేదని తెలిపింది. అత్త, మామలు కోడలిగా అంగీకరించ లేదని వెల్లడించింది.

 

ఏడాదిగా మనోవేదనకు గురి చేస్తున్న భర్త, అత్తింటివారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలంటూ చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన వి.గౌరి, భాస్కర్ దంపతుల పెద్ద కుమార్తె దీపిక స్థానిక మహిళా సంఘం నాయకులతో కలిసి విలేకరులకు తెలిపిన వివరాలివీ.. దీపికకు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ జడ్జి కుమారుడు కృష్ణ చైతన్యతో 2015 మేలో వివాహమైంది.

 ఆ సమయంలో కట్నం కింద 30 తులాల బంగారం కూడా ఇచ్చారు. పెళ్లయిన వెంటనే అత్తింటి వారు ఆమెను తీసుకెళ్లారు. అయితే, భర్త ఆమెతో మాట్లాడేవాడు కాదు. ప్రేమగా చూసుకునే వాడు కాదు. వారి మధ్య ఏ విధమైన శారీరక సంబంధం కూడా ఏర్పడలేదు. అయితే, అతని మానసిక పరిస్థితి బాగాలేదని, బీపీ, హై షుగర్, స్కిజోఫ్రెనియా ఉన్నట్లు తెలిసింది. దీపికను అత్తమామలు సరిగా చూసుకునేవారు. అత్త, ఆడపడుచు మాటలతో వేధిస్తుండేవారు.

 

ఈ విషయాలు బయటకు చెబితే చంపేస్తామని వారు దీపికను బెదిరిస్తున్నారు. తనను మోసం చేసి, జీవితంతో ఆడుకుంటున్న అత్త, మామలు, ఆడపడుచు, పెళ్లి మధ్యవర్తిగా వ్యవహరించిన శ్రీనివాస్‌రెడ్డిలను తక్షణం అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని దీపిక డిమాండ్ చేసింది. దీపిక అత్త, మామలు 24గంటల్లోపు స్పందించకుంటే వాళ్ల ఇంటిదగ్గరే మకాం వేసి మహిళలంతా కలసి ధర్నా చేస్తామని మహిళానాయకులు హెచ్చరించారు.  

 

Advertisement
 
Advertisement
Advertisement