నిబంధనలకు విరుద్ధంగా వైఎస్ఆర్సీపీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాను సస్పెండ్ చేశారని వైఎస్సార్ సీపీ నాయకుడు, చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా వైఎస్ఆర్సీపీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాను సస్పెండ్ చేశారని వైఎస్సార్ సీపీ నాయకుడు, చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిబంధనలను ఉల్లంఘించడం ప్రభుత్వానికి అలవటైందని దుయ్యబట్టారు. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన అనంతరం గురువారం చెవిరెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడుకు ఏ మాత్రం నైతికత ఉన్నా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో ఏ రాష్ట్రం ఇంతలా దిగజార లేదని చెవిరెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యే రోజా ఏడాది పాటు సస్పెన్షన్పై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తాము స్వాగతిస్తున్నామని చెవిరెడ్డి తెలిపారు. రూల్స్కు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న ప్రతి అంశంపై కోర్టును ఆశ్రయిస్తామని ఆయన అన్నారు. న్యాయం జరిగే వరకు పోరాడుతామని చెవిరెడ్డి స్పష్టం చేశారు.