రూ.198 కోట్లతో కేజీబీవీలకు భవనాలు | Sakshi
Sakshi News home page

రూ.198 కోట్లతో కేజీబీవీలకు భవనాలు

Published Wed, Jan 3 2018 4:12 AM

Buildings to the KGBVs with 198 crores - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) రూ.198 కోట్లతో 61 అకడమిక్‌ బ్లాక్‌లు, 34 కేజీబీవీలకు నూతన భవన నిర్మాణాలకు ఈ నెల 15లోపు శంకుస్థాపనలు చేసి, అక్టోబర్‌ నాటికి భవనాలు పూర్తి చేయాలని ఉపముఖ్య మంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర కేజీబీవీలు దేశంలో అత్యు త్తమంగా ఉన్నాయని, వీటిని మరింత పటిష్ట పరచాలని సూచించారు. కేజీబీవీ, మోడల్‌ స్కూల్స్, గురుకులాల్లోని విద్యార్థులకు వసతు లు, హెల్త్‌ కిట్ల పంపిణీ, మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌ ఆచార్య, అధికారులతో సచివాలయంలో ఆయన సమీక్షించారు. ఆయా విద్యా సంస్థల్లోని విద్యార్థులకు ఈ నెల 9లోగా హెల్త్‌ కిట్లు అందజేయాలన్నారు. 4 దశలుగా ఏడాదికి సరిపడేలా ఇవ్వాలన్నారు. బాలికలకు, బాలురకు విడివిడిగా హెల్త్‌కిట్లు రూపొందించినట్లు చెప్పారు. ఈ కిట్ల కోసం ఏటా రూ.12 కోట్ల వ్యయం అవుతోందన్నారు. 

కలెక్టర్ల నేతృత్వంలో సమీక్షలు
ఈ ఏడాది జనవరి 1 నుంచి అన్ని విద్యా సంస్థల్లో ఒకేరకమైన మెనూ అందిస్తున్నట్లు తెలిపారు. మెనూలో ఉదయం 6 గంటలకే 250 మిల్లీలీటర్ల పాలు.. ఆ తర్వాత అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం అందిస్తున్నట్లు వివరించారు. నెలకు 4 సార్లు చికెన్, 2 సార్లు మటన్, రోజూ గుడ్డు, నెయ్యి అందిస్తున్నట్లు చెప్పా రు. పదో తరగతి వార్షిక పరీక్షలను దృష్టిలో పెట్టుకుని జిల్లాల వారీగా కలెక్టర్ల నేతృత్వంలో జిల్లాలోని ప్రధానోపాధ్యా యులు,స్పెషల్‌ ఆఫీసర్లతో సమీక్షలు నిర్వహించాలన్నారు. పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధ మవడంలో లోటుపాట్లు లేకుండా చూడాల ని ఆదేశించారు. సమావేశంలో విద్యాశాఖ డైరెక్టర్‌ కిషన్, విద్యాశాఖ సంక్షేమ, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఎండీ విజయ్‌ కుమార్, చీఫ్‌ ఇంజనీర్‌ మల్లేశం, కేజీబీవీల డైరెక్టర్‌ శ్రీహరి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌ శేషు కుమారి పాల్గొన్నారు.  

Advertisement
Advertisement