బతుకమ్మ చీరల విలువ రూ.200 కోట్లు | Sakshi
Sakshi News home page

బతుకమ్మ చీరల విలువ రూ.200 కోట్లు

Published Sun, Aug 27 2017 2:00 AM

Batukhamma saris worth Rs 200 crore

పంపిణీపై కలెక్టర్లతో సీఎస్‌ సమీక్ష 
 
సాక్షి, హైదరాబాద్‌: గ్రామం యూనిట్‌గా బతుకమ్మ కానుక కింద పేద మహిళలకు చీరలను పంపిణీ చేయనున్నట్టు ప్రభుత్వ సీఎస్‌ ఎస్పీ సింగ్‌ తెలిపారు. వీటికోసం రూ.200 కోట్ల వ్యయం కానున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంపై శనివారం సచివాలయం నుంచి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆహార భద్రత కార్డులో నమోదైన 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ  పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు ఫొటో గుర్తింపు కార్డులను చూపించాల్సి ఉంటుందన్నారు. ఆగస్టు 1న నవీకరించిన ఆహార భద్రత కార్డుల జాబితా ప్రకారం పంపిణీ ఉంటుందన్నారు.

మున్సిపాలిటీల పరిధిలో మున్సిపల్‌ కమిషనర్లు , ఇతర ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు ఈ పంపిణీకి బాధ్యత వహిస్తారన్నారు. సెప్టెంబర్‌ 15కల్లా జిల్లా పాయింట్‌లకు చీరలను చేరవేస్తారన్నారు. వాటిని గ్రామాల్లోని గోడౌన్లకు 17లోగా పంపాలన్నారు. గ్రామ స్థాయిలో జిల్లా కలెక్టర్లు నియమించిన ప్రభుత్వ ఉద్యోగులు పంపిణీ చేస్తామన్నారు. పంపిణీ పూర్తి పారదర్శకంగా ఉండాలని సూచించారు. కలెక్టర్లు బతుకమ్మ చీరల పంపిణీ ప్రణాళికను వారం రోజుల లోపల రూపొందించాలని ఆదేశించారు. సిబ్బందికి పంపిణీ విషయంలో శిక్షణ కూడా ఇవ్వాలని కోరారు. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో జీహెచ్‌ఎంసీ చీరలు పంపిణీ చేస్తుందన్నారు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement