అధికారం–అపశ్రుతులు

Gollapudi Maruthi Rao Article On Politics - Sakshi

జీవన కాలమ్‌

నేను అందరిలాగే పత్రిక లలో రాజకీయ పరిణా మాలు తెలుసుకుని స్పందించే ఓటర్ని. ఏ రాజ కీయ పార్టీకీ చెందినవాడినీ కాను. ఆ కారణానికే కొన్ని పరిణామాలు వింతగా, విడ్డూరంగా, వికృతంగా, విపరీతంగా కనిపిస్తాయి. పార్టీలో నాయకత్వం పట్ల అందరికీ అన్నివి ధాలా విధేయత ఉండాలి. ఇది అందరు రాజకీయ నాయకులు ఒప్పుకునే, గర్వంగా చెప్పుకునే సద్గు ణం. లోగడ కనీసం అయిదారు సందర్భాలలో మెజా రిటీ సాధించిన కాంగ్రెస్‌ అతిగర్వంగా ‘మేం అధి ష్టాన వర్గం మాటని అక్షరాలా పాటిస్తామ’ని చెప్ప డం మనకి తెలుసు. నిజానికి వారేం చెప్తారో ముందు మనకే తెలుసు. కానీ తీరా నాయకుడి ఎన్నిక జరిగాక చాపకింద నీరులాగ మెల్లగా తమ తమ అసంతృప్తు లను అనుచరుల ద్వారానో– ఇంకా బరితెగిస్తే తామో బయటపడి చెప్పడం మనం విన్నాం. నిజా నికి కాంగ్రెసులోంచి విడిపోయి మరో పార్టీగా అవతరించిన అన్ని పార్టీల మూల కథ ఇదే. అలనాటి దేవరాజ్‌ ఉర్స్, నిజలింగప్ప, మొరార్జీ దేశాయ్, శరద్‌యాదవ్, సంగ్మా ప్రభృతుల కథలన్నీ ఇవే. అయితే ఈ నాయ కులు ఉన్నతులు. ఆయా రాష్ట్రాల్లో ప్రముఖులు. కాగా–ముఖ్యమైన విషయం– అప్పటి అధిష్టాన వర్గం గురుతరమైనది.

కాగా, ఇప్పటి నాయకులు మరుగుజ్జులు. అంత వ్యక్తిత్వాలున్న నాయకులు లేరు. ఉదాహరణకు అలనాడు ఆనంద శర్మ, గులాంనబీ ఆజాద్‌ పేర్లు చిన్నవి. రెండో పేరు చెప్తే అలనాడు పాలకవర్గానికి చెందిన ఒకాయన చర్రుమన్న సందర్భం నాకు తెలుసు. ఏతావాతా ఇవాళ ముఖ్యమంత్రి పదవికి ఎన్ని కైన నాయకులలో ఒకాయన మీద 1984 మారణ కాండ ‘మచ్చ’ ఉంది. మరొకాయన ‘నీతులు మాట్లాడే’ పార్టీ మీటింగు ముందు వరసలో కనిపిం చారు. వీరంతా అద్భుతమైన కాఫీ డికాషన్‌ కింద మిగిలిన ‘మడ్డి’ లాంటి వారు.ఈ మధ్య కాంగ్రెస్‌ పదవిలోకి వచ్చి చాలా రోజు లయింది. అదిన్నీ చావు తప్పి కన్నులొట్టపోయినట్టు ఎదుటి పార్టీ లోపంవల్ల మిగిలిన చచ్చు మెజారిటీ. వెంటనే ఈ నాయకుల భాషణ విన్నాం. ‘మా అధి ష్టానం ఏం చెప్తే అది పాటిస్తాం’ అంటూ. అధిష్టానం ఏం చెప్పాలో తాము చెప్పడానికి ఢిల్లీ పరిగెత్తిన సంఘటనలు మనం చూస్తున్నాం. తీరా అధిష్టానం– రాజస్తాన్‌లోలాగ సీనియర్‌ నాయకుని పదవిలో నిలి పితే ఛోటా నాయకుని వర్గీయులు ‘కాంగ్రెస్‌ని నాశ నం చేస్తాం’ అని టీవీ కెమెరాల ముందు బోరవిరు చుకోవడం మనం చూశాం. సరే. మధ్యప్రదేశ్‌ నాయ కుని మీద 1984 ‘పొడ’ ఉందని విమర్శలు లేచాయి. కర్ణాటకలో చచ్చీ చెడీ పదవిలోకి వచ్చిన ప్రభు త్వంలో అధిష్టానానికి ఎదురు తిరిగిన సభ్యులు, ముష్టియుద్ధాలు ఇప్పుడు టీవీల్లో చూస్తున్నాం. వారు అధికార అసెంబ్లీ సమావేశానికి హాజరు కాలేదు.

ఇక అటువేపు చూద్దాం. మనం ఎప్పుడూ ఆనందీ బెన్‌ పేరు వినలేదు. విజయ్‌ రూపానీ పేరు వినలేదు. దేవేంద్ర ఫడ్నవీస్‌ పేరు తెలీదు. ఆ మాటకి వస్తే నితిన్‌ గడ్కరీ పేరు వినలేదు. ఇవాల్టి స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ గారి పేరు వినలేదు. కానీ వీరి ఎంపిక జరిగాక ఎవరూ టీవీల ముందు కాంగ్రెస్‌లో లాగ సన్నాయి నొక్కులతో విరగబడలేదేం? అలాగే పదవిలో ఉన్న ముఖ్యమంత్రి (ఆనందీబెన్‌) ‘నాకు వయస్సు మీద పడింది. పదవిలో ఉండను’ అని తప్పుకోవడం వినలేదు. మనకు హైదరాబాద్‌ రాజ్‌ భవన్‌లో శృంగార కార్యకలాపాలు వెలగబెట్టిన ముసిలి గుజ్జు ఎన్డీ తివారీలే తెలుసు. పార్టీ పదవి లోకి వచ్చాక ఎల్‌కే అడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషికి పదవులు రాకపోవడం తెలీదు. అడ్వాణీని రాష్ట్రపతిని చేయడం తెలీదు. ఏమైంది?

అధికారానికి బేషరతయిన, అకల్మషమయిన భక్తి అయినా ఉండాలి. శక్తి అయినా ఉండాలి. ఉదా హరణలు బోలెడు: జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీ. మొదటి వ్యక్తిపట్ల భక్తి, రెండవ వ్యక్తిది శక్తి. ఎమ్‌.జీ.ఆర్, ఎన్‌.టీ.ఆర్‌ నికార్సయిన మెజారిటీ. అందుకనే మహిళలకు ఆస్తిలో వాటా, గ్రామాలలో అధికారాల సరళతరం, మద్యపాన నిషేధం వంటి పనులు నల్లేరుమీద బండిలాగ చేయగలిగారు. అధికారంలో ఆత్మవంచన, అవకాశవాదం, స్వార్థం, పరిస్థితులకు పబ్బం గడుపుకునే స్వభావం– ఆ అధికారాన్ని గబ్బు పట్టిస్తాయి. ఉదాహరణ–10 జనపథ్‌ ఒక్కటి చాలు.

అలనాడు శ్రీరాముడిది ప్రజల భక్తి. రావణుడిది శక్తి. అయినా రాముడి పాలనలో రజకుడు ఉన్నాడు. లంకలో రజకుడు నోరెత్తలేడు. అవిధేయత పునాదులు పెకలించలేనంత బలంగా, లోతులకు పాతుకున్నప్పుడు– అధికారా నికి తప్పనిసరిగా ‘శక్తి’ అవసరం. ఇది సమకాలీన వ్యవస్థకి అవసరమైన ఆయుధం. ఇప్పటి వ్యవస్థలో దీని పేరు ‘మెజారిటీ’. అధికారానికి పట్టిన ‘గబ్బు’ని అచిరకాలంలోనే మనం చూశాం. 70 ఏళ్ల వ్యవస్థలో ప్రజాస్వామ్యం కంపు కొడు తోందని ఆనాడే గుర్తించిన గాంధీగారు కాంగ్రెస్‌ పార్టీని ఆనాడే అటకెక్కించమన్నారు. ఎక్కించకపోతే ఏమవుతుంది? ముందు రోజులు చెప్తాయి.

గొల్లపూడి మారుతీరావు
 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top