సాగరం చుట్టిన వనితలు

Womens  going 200 days long trip to the ocean - Sakshi

‘నావికా సాగర్‌ పరిక్రమ’ విజయవంతం చేసిన ఆరుగురు మహిళా కెప్టెన్‌లు

వారిలో ఇద్దరు తెలుగు అమ్మాయిలు

కీలక బాధ్యత వహించిన లెఫ్ట్‌నెంట్‌ కమాండర్‌ ఐశ్వర్య

కమ్యూనికేషన్స్‌ ఆఫీసర్‌గా స్వాతి పాతర్లపల్లి

ఎగిసిపడే అలల్ని చూసి జడిసిపోలేదు. పెనుగాలులకు చిగురుటాకైన నావను చూసి వణికిపోలేదు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 200 రోజులకు పైగా సాగిన సాగర యాత్ర... సగర్వంగా ప్రపంచ రికార్డులకెక్కింది. భారతీయ వనితల సత్తాను చాటింది.  పెద్ద తుఫాన్, చల్లని ఈదురుగాలులు, ఎముకలు కొరికే చలి.... ఎన్ని అవరోధాలు ఎదురైనా అనుకున్నది సాధించే వరకు పట్టువీడలేదు. రెండు మహా సముద్రాల మీదుగా లక్ష్యాన్ని చేరుకున్నారు. భారతీయ మహిళా నావికుల సామర్థ్యాన్ని ప్రపంచాన్ని చాటేందుకు ఇండియన్‌ నేవీ 2017 సెప్టెంబర్‌ 10న ‘నావికా సాగర్‌ పరిక్రమ’ పేరుతో యాత్రను ప్రారంభించింది. ఇందుకోసమని దేశవ్యాప్తంగా ఉన్న నేవీ విభాగాల నుంచి మెరికల్లాంటి ఆరుగురు మహిళా కెప్టెన్‌లను నియమించింది. వీరిలో విశాఖపట్టణానికి చెందిన స్వాతి పాతర్లపల్లి,  హైదరాబాద్‌కు చెందిన బొడ్డపాటి ఐశ్వర్యలు ఉన్నారు. యాత్ర ఎలా జరిగింది, ఇబ్బందులు ఎలా ఎదురైయ్యాయి, ఆనంద క్షణాలు ఏంటి అనే విషయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు విశాఖపట్టణానికి చెందిన స్వాతి పాతర్లపల్లి, హైదరాబాద్‌కు చెందిన నేవీ లెఫ్ట్‌నెంట్‌ కమాండర్‌ ఐశ్వర్య బొడ్డుపల్లిలు. 

2015లోనే కార్యచరణ
‘నావికా సాగర్‌ పరిక్రమ’ కోసం 2015లోనే కార్యచరణను ప్రారంభించారు నేవీ అధికారులు. ఇండియన్‌ బోటు ద్వారా సుదీర్ఘదూరం సముద్రంలో యాత్ర చేయాలనేది నేవీ రిటైర్డ్‌ వైస్‌ అడ్మిరల్‌ మనోహర్‌ కల. ఆ కలను సాకారం చేసేందుకు ఇండియన్‌ నేవీ సీలింగ్‌ వెజిల్‌ని తయారు చేసింది. కెప్టెన్‌ దిలిప్‌ డోండే సారధ్యంలో టీమ్‌ ఏర్పాటైంది. ఇందులో వైజాగ్‌కు చెందిన నేవిగేటింగ్‌ అండ్‌ కమ్యునికేషన్‌ ఆఫీసర్‌ స్వాతి పాతర్లపల్లి, హైదరాబాద్‌కు చెందిన లెఫ్ట్‌నెంట్‌ కమాండర్‌ ఐశ్వర్య బొడ్డుపల్లి, వర్తికా జోషి (రిషికేష్‌), ప్రతిభా జాంబ్వాల్‌ (హిమాచల్‌ ప్రదేశ్‌), విజయదేవి (మణిపూర్‌), పాయల్‌ గుప్తా (డెహ్రడూన్‌)లు ఎంపికయ్యారు. వీరికి ‘నావికా సాగర్‌ పరిక్రమ’ చేపట్టే ఏడాది ముందు నుంచే ట్రైనింగ్‌ను ఇచ్చారు. ట్రయల్‌ ట్రిప్‌గా 2016 మేలో గోవా నుంచి మారిషస్‌కి వీరిచే ఒక మినీ యాత్రను నిర్వహించారు. సుమారు 8 వారాల పాటు సాగిన ఈ ట్రైనింగ్‌ యాత్రలో ఎదురైన ఒడిదుడుకులను వీరు ఎదిరించారు. మార్గమధ్యలో బోటు రిపేర్‌ అయితే వారంతటికి వారే రిపేర్‌ చేసుకోవడం, పెద్ద పెద్ద అలలు తాకినప్పుడు ధైర్యంగా నిలవడాన్ని చూసిన భారత నేవీ అధికారులు ‘నావిక సాగర్‌ పరిక్రమ’ యాత్ర చేపట్టేందుకు పూర్తి అనుమతి ఇచ్చారు.
 
సముద్రంలో 199 రోజులు
2017 సెప్టెంబర్‌ 10న గోవా నుంచి ‘తరుణి’ బోటులో ‘నావికా సాగర్‌ పరిక్రమ’ మొదలైంది. ఇది 254 రోజులు సాగింది. రెండు మహాసముద్రాలు పసిఫిక్, అట్లాంటిక్‌ మీదుగా సుమారు 21,600 కి.మీ. ప్రయాణించారు. సముద్రం మీద వీరు రోజులు 199 రోజులు ఉంటే, 55 రోజులు వివిధ దేశాల్లో మన దేశ కార్యక్రమాలైన మహిళా సాధికారిత, మేక్‌ ఇన్‌ ఇండియా, మానిటరింగ్‌ మెరీన్‌ పొల్యూషన్, మానిటిరింగ్‌ వెదర్‌ అండ్‌ గివింగ్‌ వంటి వాటిపై అవగాహాన కల్పించారు. ఆయా దేశాల్లో అక్కడి స్త్రీలతో మమేకమై వీరి యాత్రా విశేషాలను పంచుకున్నారు. 

విపత్కర పరిస్థితులను ఎదురించిన స్వాతి
వైజాగ్‌కు చెందిన స్వాతి పాతర్లపల్లి నేవీలో నేవిగేటింగ్‌ అండ్‌ కమ్యునికేషన్‌ ఆఫీసర్‌గా చేస్తున్నారు. ఈ యాత్రలో కమ్యునికేషన్‌ అండ్‌ నేవిగేటింగ్‌ చూసుకునే బాధ్యత స్వాతిదే. రోడ్డు మార్గంలో ఏదైనా యాత్ర చేస్తున్నప్పుడు కమ్యునికేషన్‌కు ఏదైనా ఇబ్బంది కలిగితే దానికి బాధ్యత వహిస్తున్న వారిపై ఒత్తిడి అధికంగా ఉంటుంది. అటువంటిది సముద్రం లోపల నేవిగేటింగ్‌ అండ్‌ కమ్యునికేషన్‌ను కంట్రోల్‌ చేయడం అంత సులువైంది కాదనే చెప్పాలి. ‘రెండు పర్యాయాలు తుఫాన్‌ వచ్చినప్పుడు నెట్‌వర్క్‌ పూర్తిగా కటై్టంది. నేవిగేషన్‌ ఎటు చూపిస్తోందో అర్థం కాలేదు. రెండు గంటల పాటు అవతలి దేశం వారికి కమ్యునికేషన్‌ కనెక్ట్‌ చేసేందుకు చాలా కష్టపడ్డాను. ఆ సమయంలో మా బోటును తాకిన అలలను చూస్తే అందరం భయపడాల్సి వచ్చింది’ అని స్వాతి చెప్పారు. 

వాలంటీర్‌గా ఐశ్వర్య కలలు సాకారం చేసుకుంది
హైదరాబాద్‌కు చెందిన ఐశ్వర్య బొడ్డుపల్లి ఈ యాత్రలో కీలకంగా వ్యవహిరించారు. ఐదుగురు లెఫ్ట్‌నెంట్‌లతో పాటు ఐశ్వర్య వాలంటీర్‌గా ఉన్నారు. ఐశ్వర్యకు చిన్నప్పటి నుంచి సముద్రంలో బోటు యాత్ర చేయాలనేది కల. ఆ కల ఇండియన్‌ నేవీ ద్వారా అదీ తాను లెఫ్ట్‌నెంట్‌ కమాండర్‌గా ఉన్న సమయంలో జరగడం ఐశ్వర్యకు ఆనందాన్ని ఇస్తోంది. ఈ యాత్రలో స్వాతి, పాయల్‌ గుప్తా, వర్తికా జోషి, విజయదేవిలకు చేదోడుగా ఉంటూ, కీలక సమయాల్లో వాలంటీర్‌ సేవలను తను అందించడం జరిగింది. ప్రపంచ రికార్డులో భాగస్వామి కావడం పట్ల ఐశ్వర్య పట్టరాని సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. 

పదిరోజులు మ్యాగీ, 14 రోజులు వర్షపునీరు
‘మేం యాత్ర ప్రారంభించిన కొద్దిరోజులకే సముద్రంలో పెద్ద తుఫాన్‌ వచ్చింది. ఆ సమయంలో మేము తెచ్చుకున్న నిత్యవసర సరుకులన్నీ తడిసిపోయి తినడానికి వీలు లేకుండా పోయాయి. పదిరోజుల పాటు మా వెంట తెచ్చుకున్న మ్యాగీని చేసుకుని ఆకలిని తీర్చుకున్నాం’ అని ఐశ్వర్య బొడ్డుపల్లి వివరించారు. ‘బోటులో ఉన్న ఆర్వోప్లాంట్‌ పాడైంది. దీంతో మంచినీళ్లు లేక ఎన్నో తిప్పలు పడ్డాము. వర్షపునీటిని పట్టుకుని కాచి చల్లార్చుకుని దాహం తీర్చుకున్నాం’ అని చెప్పారు.

రాత్రంతా చలిలోనే..
‘ఫసిఫిక్‌ మహాసముద్రం దాటిన తరువాత పెద్ద పెద్ద అలలు వ్యాపించాయి. వాతావరణం చాలా చల్లగా అయిపోయింది. అలలు క్రాష్‌ అయ్యాయి. ఆ సమయంలో లెఫ్ట్‌నెంట్‌ కమాండర్‌ పాయల్‌గుప్తా తలకు బలమైన గాయం అయ్యింది’ అని ఐశ్వర్య చెప్పారు. ‘బోటు ముఖద్వారం వద్ద రెండు పెద్ద తెరచాపలు ఉన్నాయి. వీపరీతమైన గాలి, వర్షం కారణంగా ఆ రెండు తెరచాపలు తెగిపడ్డాయి. దీంతో చల్లని గాలి బోటు లోపలకి రావడంతో రాత్రంతా నిద్ర మానుకుని చలిలోనే గడపాల్సి వచ్చింది’ అని స్వాతి గుర్తు చేశారు. 

స్వీట్‌ మెమోరీస్‌..
‘అట్లాంటిక్‌ మహా సముద్రం దాటుతుండగా జనవరి 7న భారీ తుఫాన్‌ వచ్చింది. బోటు విపరీతంగా కిందకు పైకి ఊగడంతో మునిగిపోతుందనే భయపడ్డాం. కాని అదృష్టం బాగుండి అలా జరగలేదు. ఆ∙తెల్లారి అంటే జనవరి 8న తేదీన అలలు నెమ్మదిగా, చక్కగా వస్తున్నాయి. ఆ సమయంలో రెయిన్‌బో ఆ అలలపై పడటం, డాల్ఫిన్స్‌ మా బోటు వద్దకు రావడం చాలా సంతోషమనిపించింది. ఇవి మా ఆరుగురికీ జీవితాంతం గుర్తుండే స్వీట్‌ మెమోరీస్‌’ అన్నారు ఐశ్వర్య. 

మారిషస్‌ వద్ద స్టీరింగ్‌ ఫెయిల్‌
‘కేప్‌టౌన్‌ నుంచి గోవా వస్తున్నప్పుడు మారిషస్‌ వద్ద స్టీరింగ్‌ ఫెయిల్‌ అయ్యింది. ఇదే సమయంలో ‘ఫకీర్‌’ అనే తుఫాన్‌ కూడా వచ్చింది. చాలా ఆందోళన చెందాము. తిరిగి గోవాకు చేరేదట్లా అంటూ అందరం మానసికంగా వేదనపడ్డాం. ఆరుగురం కలసి అత్యంత కష్టం మీద ఆ బోటును రిపేర్‌ చేసుకుని యాత్రను విజయవంతం చేశాం’ స్వాతి, ఐశ్వర్యలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. 

రాష్ట్రపతి నుంచి కితాబు
యాత్రను విజయవంతం చేసుకుని ప్రపంచ రికార్డును నెలకొల్పిన సందర్భంగా భారత ప్రధాని రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ నారీమణులను గురువారం సత్కరించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో స్వాతి పాతర్లపూడి, ఐశ్వర్య బొడ్డుపల్లి, పాయల్‌ గుప్తా, ప్రతిభా జంబ్వాల్, వర్తికా జోషి, విజయదేవిలు రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలిశారు. యాత్రను విజయవంతం చేసుకుని భారత్‌కు తిరిగొచ్చి యావత్‌ప్రపంచానికి మహిళల ఔన్నత్యాన్ని చాటి చెప్పడం పట్ల రాష్ట్రపతి వీరిని కొనియాడారు.

గర్వంగా ఉంది
మా అమ్మాయి ఐశ్వర్యని చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. నేవీలోకి వెళ్లేముందు చాలా మంది ఎందుకు పంపిస్తున్నారన్నారు. అయినా మేం లెక్కచెయ్యలేదు. తన ఇష్టానికి ప్రాధాన్యతను ఇచ్చి ప్రొత్సహించాం. ఈ యాత్ర మొదట్లో అందరూ ఆడపిల్లలే... ధైర్యంగా ఉండగలరా అని టెన్షన్‌ పడ్డాం. మధ్య మధ్య ఫోన్‌ చేసి తను క్షేమంగా ఉన్నానని చెప్పడంతో సంతృప్తి చెందాం. బోటు రిపేర్‌ అయిన విషయాన్ని చెప్పినప్పుడు తిరిగి ఇంటికి వస్తారా..రారా అంటూ ఆందోళన చెందాము. కాని ఇవాళ యాత్ర విజయవంతం కావడంలో మా అమ్మాయి పాత్ర కూడా ఉండటం గర్వంగా ఉంది. ఆడపిల్లలను ఇంటికే పరిమితం చెయ్యకుండా వారికి నచ్చిన రంగంలో అవకాశాన్ని కల్పిస్తే వారు ఏదైనా సాధిస్తారు. 
– సాయిప్రభాకర్, సత్యవాణ(ఐశ్వర్య తల్లిదండ్రులు)

తిండితిప్పలు మానేశాం
‘నావికా సాగర్‌ పరిక్రమ’ యాత్రలో రెండు సార్లు తుఫాన్‌ వచ్చిన విషయం మాకు చెప్పలేదు. తన స్నేహితుల ద్వారా తెలుసుకున్నాం. ప్రతి రెండు రోజులకోసారి ఫోన్‌ చేసి మమ్మల్ని పలకరించేది. మేము కూడా ఆరుగురి యోగక్షేమాలు తెలుకునే వాళ్లం. యాత్ర విజయవంతం అయ్యి తిరిగొచ్చాక నా కూతురు ఏదైనా సాధిస్తుందనే నమ్మకం మాలో దృడంగా కలిగింది. ఆడపిల్లలకే ప్రతి  తల్లిదండ్రులు ప్రాధాన్యతను ఇవ్వాలి. మేము మా అమ్మాయి టాలెంట్‌ను గుర్తించి ప్రోత్సహించాం, ఇప్పుడు ఆమె ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. 
– పాతర్లపల్లి రాణి, ఆదినారాయణ (స్వాతి తల్లిదండ్రులు) 
– చైతన్య వంపుగాని, సాక్షి ప్రతినిధి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top