నావికాదళ చీఫ్‌గా స్వామినాథన్‌  | Admiral Krishna Swaminathan assumes charge as new Chief of Naval Staff | Sakshi
Sakshi News home page

నావికాదళ చీఫ్‌గా స్వామినాథన్‌ 

Jun 1 2026 5:11 AM | Updated on Jun 1 2026 6:35 AM

Admiral Krishna Swaminathan assumes charge as new Chief of Naval Staff

న్యూఢిల్లీ: భారత నావికాదళం నూతన అధిపతిగా అడ్మిరల్‌ కృష్ణ స్వామినాథన్‌ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఇంతకాలం ఆయన పశ్చిమ నేవీ కమాండ్‌కు ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌–ఇన్‌–చీఫ్‌గా సేవలందించారు. నేవీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టాక స్వామినాథన్‌ మాట్లాడారు. ‘‘ప్రస్తుతం ప్రాంతీయ భద్రతా వాతావరణం సవాళ్లతో కూడుకుంది. ఇది సంక్లిష్టతతో అనిశ్చితితో అనూహ్యంగా తయారైంది. 

ఎంతటి క్లిష్టపరిస్థితుల్లోనైనా దేశ భద్రతే ధ్యేయంగా అత్యున్నత కార్యాచరణ సంసిద్ధత, పోరాట సామర్థ్యాన్ని కొనసాగించడమే లక్ష్యంగా పని చేస్తా. జాతీయ ప్రయోజనాల పరిరక్షణకు నౌకాదళం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. మన నౌకదళం ఎల్లప్పుడూ చురుగ్గా పనిచేస్తోంది. ఆధునీకరణ మార్గంలో పయనిస్తోంది. 

నౌకాదళ వృద్ధి వేగాన్ని కొనసాగించడం, అమల్లో ఉన్న కార్యక్రమాలను మరింత పటిష్టం చేయడం, అవసరమైన చోట వాటిని విస్తరించడం, ప్రత్యేకమైన, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలను ప్రవేశపెట్టడం ద్వారా కార్యాచరణ సామర్థ్యాలకు పెంపొందిస్తా’’ అని స్వామినాథన్‌ ఉద్ఘాటించారు.  

స్వామినాథన్‌ 1987 జూలై 1న ఇండియన్‌ నేవీలో చేరారు. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, జాయింట్‌ సర్వీసెస్‌ కమాండ్‌ అండ్‌ స్టాఫ్‌ కాలేజీ, కాలేజీ ఆఫ్‌ నావల్‌ వార్‌ఫేర్, యూఎస్‌ నావల్‌ వార్‌ కాలేజీలో శిక్షణ పొందారు. కమ్యూనికేషన్, ఎల్రక్టానిక్‌ యుద్ధరీతిలో నిపుణుడిగా పేరుగాంచారు. ఐఎన్‌ఎస్‌ విద్యుత్, వినాశ్‌ క్షిపణి నౌకలు, ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య తదితర యుద్ధ నౌకలకు సారథ్యం వహించారు.  పరమ విశిష్ట సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్, విశిష్ట సేవా మెడల్‌ అందుకున్నారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement