వినాయక విహారం

Vinayaka chavithi special  - Sakshi

పండగ ప్రత్యేకం

వినాయకుడు చవితి పండగ నాడు భూలోకానికి విహారానికి వస్తే?తన జనని పార్వతీదేవికి ఇక్కడి వింతలు విడ్డూరాలు చూపిస్తే..నారదుడు ఆ ట్రిప్‌కు లైవ్‌ రిపోర్టింగ్‌ అందిస్తే.. చదివిన వారికి పుణ్యమూ, ఫలమూ దక్కినట్టే కదా!

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్‌
ప్రసన్న వదనం ధ్యాయేత్‌ సర్వవిఘ్నోపశాంతయే
అగజానన పద్మార్కం గజాననమహర్నిశమ్‌ 
అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే‘‘

కృష్ణద్వీపంలో నివసించే వేదవ్యాసుడికి మదిలో ఒక కథ మెదిలింది. ఆ కథను అక్షరీకరించాలనుకున్నాడు. తాను నిరాఘాటంగా చెబుతుంటే, ఆపకుండా రాయగలిగే వ్రాయసగాని కోసం వెదికాడు వ్యాసుడు.అప్పుడాయన మదిలో వినాయకుడు మెదిలాడు. ఈ సత్కార్యం విఘ్ననాయకుడైన వినాయకుని పవిత్ర హస్తాల మీదుగా సాగితే బాగుంటుంది అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా, వినాయకుడి దగ్గరకు స్వయంగా వెళ్లి, ‘నాయనా! నేను మహాభారత రచన చేద్దామనుకుంటున్నాను. నాకు వ్రాయసకాడు కావాలి. నేను వేగంగా చెబుతుంటే, అంతే వేగంగా రచన చేయాలి. ఇలా రాయాలంటే తప్పనిసరిగా వ్రాయసకాడు కూడా జ్ఞాని అయి ఉండాలి. అందుకు నువ్వే తగినవాడివని భావించాను. మన భారత రచన ఎప్పుడు ప్రారంభిద్దాం గణేశా’ అని ఆప్యాయంగా పలకరించాడు వ్యాసభగవానుడు. అందుకు ఆ గజాననుడు వినమ్రంగా శిరసువంచి, ‘మహర్షీ! మీ అంతటివారు నన్ను ఎంచుకున్నందుకు సదా ధన్యుడిని. మీరు ఎప్పుడు సుముహూర్తం నిర్ణయిస్తే అప్పుడే ప్రారంభిద్దాం’ అన్నాడు ఉమాపుత్రుడు.‘మంచిపనికి ముహూర్తం అక్కర్లేదు నాయనా! తక్షణమే ప్రారంభిద్దాం ఈ శుభకార్యాన్ని’ అన్నాడు బాదరాయణుడు. లంబోదరుడు పాదప్రక్షాళనం చేసుకుని, తాళపత్రాలు, ఘంటం చేతబట్టి, మనస్సులో ఆదిదంపతులను స్మరించి, మనస్సును భ్రూమధ్యంలో లగ్నం చేసి, రచనకు సన్నద్ధుడయ్యాడు. వ్యాసుడి నోటి నుంచి శ్లోకాలు నిశిత శరాలుగా వెలువడుతున్నాయి, వినాయకుడి ఘంటం కూడా అంతే వేగంగా పరుగులు తీస్తోంది, భారత రచన సాగింది. రచన పూర్తయ్యేవరకు వినాయకుడు కదలలేదు, మెదలలేదు, పెదవి కదపలేదు. శ్రీమన్మహాభారతం నిర్విఘ్నంగా పద్దెనిమిది పర్వాలు లక్ష శ్లోకాలు పూర్తయ్యాయి. వ్యాసుడికి నమస్కరించి, ఆయన దగ్గర సెలవు పుచ్చుకుని కైలాసంలో ఉండే తన తల్లిదండ్రులను దర్శించుకున్నాడు. క్షేమసమాచారాలు కనుక్కున్నారు పార్వతీపరమేశ్వరులు. వ్యాసభగవానుడి అద్భుత సృష్టికి తమ కుమారుడు ఘంటం పట్టినందుకు ఆనందపారవశ్యం చెందారు వారు. భూమి మీద భారతం ఉన్నంతకాలం వినాయకుడి పేరు కూడా నిలబడిపోతుందని ఆనందించారు ఆది దంపతులు.

‘‘అమ్మా! ఇంతకాలం వ్యాసభగవానుడి దగ్గర ఉండి, జ్ఞానసముపార్జన చేశాను. ఎంతో అందమైన భారతాన్ని ఆయనకు లేఖకుడిగా ఉన్న కారణంగా అందరికంటె ముందుగా తెలుసుకోగలిగాను. ఇంతటి మహేతిహాసాన్ని మరెవ్వరూ కొన్ని యుగాలు గడిచినా రచించలేరమ్మా! ఇంతకాలం మీకు దూరంగా ఉన్నందుకు నేను ఎన్నడూ చింతించలేదమ్మా. నా రచనా ప్రావీణ్యాన్ని చూసి మీరు కూడా సంబరపడే ఉంటారు. ఇప్పుడు నా మనసుకి కొంచెం విశ్రాంతి కావాలనిపిస్తోంది. కొంతసేపు భూలోకంలో సంచరించాలని ఉంది.  నా పుట్టినరోజు వేడుకలను భూలోక వాసులు ఎంతో సంబరంగా జరుపుకుంటారు కదా. ‡ నీ అనుమతితో భూలోకంలో సంచరించాలనుకుంటున్నానమ్మా’ అన్నాడు గణనాయకుడు. అందుకు పార్వతి, ‘నాయనా! నాకు నీ వెంట రావాలని ఉంది. నిన్ను ఒక్కో సంవత్సరం ఒక్కో కొత్త అవతారంలో భూలోకవాసులు చూసుకుంటున్నారు కదా. ఎక్కడెక్కడ ఎవరెవరు నిన్ను ఎలా పూజిస్తున్నారో కనులారా చూసి ఆనందించాలని ఉంది’ అంది పార్వతి. ‘నా మూషికం మీద ఈ యావత్ప్రపంచం నీకు చూపిస్తానమ్మా. ముందుగా నన్ను ఆశీర్వదించు’ అని తల్లి దగ్గర దీవెనలు అందుకుని, ఆమెను తన వాహనం మీద కూర్చుండబెట్టుకుని బయలుదేరాడు వినాయకుడు. వినాయకుడు భూలోక సంచారానికి బయలుదేరుతున్నాడన్న వార్త తెలిసిన త్రిలోక సంచారి నారదుడు, ఈ సమాచారాన్ని తానే ముందుగా అందరికీ అందించాలని, వినాయకుడి కంటె ముందుగానే తన సామాగ్రితో బయలుదేరాడు. వినాయకుడి వెంట తల్లి కూడా ఉండటం చూసి, వెంటనే ‘తాజా వార్త’ అంటూ ప్రచారం చేసేసి, మళ్లీ వారి వెంట బయలుదేరాడు నారదుడు మరింత సమాచార సేకరణ కోసం.‘నాయనా! నిన్ను రకరకాల వేషాలతో విగ్రహాలుగా తయారు చేస్తుంటారు కదా! నీకు కోపం రాదా’ అని ప్రశ్నించింది పార్వతి.

వినాయకుడు చిరునవ్వులు చిందిస్తూ, ‘అమ్మా! నాకు ఏది కావాలన్నా నిన్నే అడుగుతాను, అలాగే నువ్వు నీకు కావలసిన విధంగా నన్ను అలంకరించుకుంటావు. అవునా. ఎందుకంటే నాకు నీ దగ్గర చనువు, నీకు నా మీద వాత్సల్యం ఉన్నాయి కాబట్టి. ముందుగా నీవు నీ ఒంటి నలుగు పిండితో నన్ను రూపొందించావు. అందుకే  అందరూ నన్ను మట్టితో రూపొందించాలి. అయితే, కొందరు బంగారంతోనూ నన్ను  తయారుచేస్తారు. నన్ను వారి ఇంటి బిడ్డగా చూసుకుంటారు. సాధారణంగా మనకు చనువైన వారి దగ్గరే మనకు కావలసినవి అడుగుతాం, చిలిపిచేష్టలు ప్రదర్శిస్తుంటాం. భూలోక వాసులకు నేనంటే ఎంతో ప్రేమ, ఎంతో చనువు ఉంది కాబట్టే నన్ను వారి ఇంటి మనిషిగా భావించి, వారికి నచ్చిన రూపంలో నన్ను అలంకరిస్తుంటారు. అంతేనా! కుంచె పట్టిన ప్రతి చిత్రకారుడు ఈ  మాసమంతా నా మీద వ్యంగ్య చిత్రాలు వేస్తూనే ఉంటాడు, హాస్యకథలు రాసేవారు నన్ను ఆధారంగా చేసుకుని హాస్యకథలు రాస్తూనే ఉంటారు’ అన్నాడు వినాయకుడు. ‘‘నాయనా! నీ మాటలు బాగానే ఉన్నాయి. నిన్ను కొందరు నులక మంచం మీద విశ్రాంతి తీసుకుంటున్న వినాయకుడిగా చూపుతారు, కొందరేమో స్కూటర్‌ వినాయకుడిగా కొలుస్తారు, మరికొందరు నీకు నల్ల కళ్లజోడు పెడతారు.

సంగీతాభిలాష ఉన్న కొందరు, నవవినాయకులుగా తొమ్మిది రకాల వాద్యపరికరాలతో నిన్ను సంగీత వినాయకుడిగా చూపుతున్నారు. కొందరు నిన్ను ఓంకార స్వరూపంగా తలుస్తున్నారు, కొందరు నువ్వు క్రికెట్‌ ఆడుతుంటే చూసి మోజుపడుతున్నారు, నిన్ను వెంకటేశ్వరునిగా మరికొందరు చిత్రీకరిస్తుంటారు. కొందరు నట వినాయకుడిగా చిత్రీకరించారు’ అని ఒక్కొక్క రూపాన్ని పార్వతీదేవి ఏకరువు పెడుతుంటే, మధ్యలోనే వినాయకుడు అడ్డుతగిలి, ‘అంతేనా అమ్మా!  కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ, నాకు పెళ్లి కూడా చేసేశారు, నాలో ఉన్న సిద్ధి, బుద్ధి అనే లక్షణాలను నా భార్యలుగా చేశారు. ఎవరు ఏం చేసినా, వారంతా నా మీద ప్రేమతో చేసినట్లే భావన చేశాను’ అంటుండగా మధ్యలో నారదుడు ప్రవేశించి, ‘అయ్యా! వినాయకా! మీరు చూసినవాటి కంటె నేను మరిన్ని రూపాలు చూశాను. మిమ్మల్ని హనుమ రూపంలో చూడాలనే కుతూహలంతో కొందరు మీ చేతితో గద ఉంచారు. మరికొందరు సర్ప వినాయకుడిని చేశారు, కొందరైతో మీతో కోలాటం ఆడించారు. ఆకులను మీ రూపంగా మలిచారు. మరికొందరు ముచ్చటగా మీ ఒడిలో శ్రీకృష్ణుడిని కూర్చోపెట్టారు. మరో అడుగు ముందుకు వేసి లక్ష్మీదేవిగా కూడా మిమ్మల్ని రూపొందించుకున్నారు’ అంటూ రకరకాల రూపాలను వివరించాడు నారదుడు.నారదుడి మాటలకు ముసిముసిగా తొండం వెనుక నుంచి నవ్వుతూ, ‘త్రిలోక సంచారీ! నాకు నచ్చేది ఒకటేనయ్యా! నా పుట్టినరోజు పేరుతో ఎంతో మంది తమలోని సృజనను వెలికి తీస్తున్నారు.

దేవతలలో ఎవ్వరికీ దక్కని ఈ ఘనత నాకు మాత్రమే దక్కింది. నా భక్తులు నన్ను వారి ఇంటి కుమారుడిగా భావించి, వారికి కావలసిన విధంగా నన్ను అలంకరించారు. మంచి తివాసీ మీద పడుకోబెడతారు, పిల్లలు తినే మిఠాయిలతో నన్ను తయారు చేస్తారు, రకరకాల పూసలతో రూపొందిస్తారు. విలాసంగా కూర్చున్నట్లుగా కొందరు నన్ను చెక్కుతారు. ఎవరు ఎలా అలంకరించినా, ఎవరు ఏ రూపంలో నన్ను ఆరాధించినా నాకు అందరి మీద ఒకే ప్రేమ ఉంటుంది’ అని పలికాడు గణనాథుడు. ఇంతలోనే నారదుడు మళ్లీ, ‘‘వినాయకా! ఇవన్నీ సామాన్యుల ఆలోచనలైతే, ఋషులు సైతం నిన్ను విడిచిపెట్టలేదు నాయనా! నిన్ను పదహారు మంది గణపతులుగా పేర్కొన్నారు. నిరుక్త్త గణపతి నుంచి మళ్లీ నిరుక్త గణపతిగా అమావాస్య నుంచి పౌర్ణమి దాకా అర్చిస్తున్నారు. ఎంతటి ఘనత గణనాథా నీది. నాది ఒక్కటే చిన్న విన్నపం గణనాథా! నీ పేరు చెప్పుకుని పర్యావరణాన్ని పాడు చేస్తున్నారు అని కొందరు నిందిస్తున్నారు. ఈ నీలాపనిందలు పడకుండా, నీ భక్తులందరికీ నిన్ను మీ అమ్మ రూపొందించినట్టుగా మట్టితోనే తయారుచేయమని ఆశీర్వదించు’ అంటూ నారదుడు సాష్టాంగపడ్డాడు. వినాయకుడు అందుకు తాను ఏమీ చేయలేనంటూ, జగజ్జనని అయిన తన తల్లితో...  నాది ఒక్కటే కోరిక అమ్మా.. నా పేరున జరుగుతున్న ఈ తొమ్మిది రోజుల పండగ సందర్భంగా ప్రతి పందిరిలోను, భక్తిపాటలను మాత్రమే వేయాలని కోరుకుంటున్నాను. మనం తల్లి దగ్గర ఒకలా, తండ్రి దగ్గర ఒకలా, పిల్లల దగ్గర ఒకలా మాట్లాడతాం. అలాగే దేవుడి పందిళ్లలో కొన్ని పాటలు వేయకుండా ఉంటే మనకు మంచిది అనిపించింది. నా పేరున అసభ్యపు పాటలు వింటున్నారని నలుగురూ నా భక్తుల గురించి అనుకోవడం నాకు బాధగా ఉందమ్మా. అందరూ నా పుట్టినరోజును సంబరంగా, సంతోషంగా, ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నా ఆశీస్సులు అందజేస్తున్నాను’’ అంటూ ముగించాడు విఘ్నేశ్వరుడు. 

ప్రసాదం...
అమ్మా! నువ్వు ఎప్పుడూ నా ప్రసాదం గురించి, ‘రుచిపచిలేని ప్రసాదం’ అని బాధపడుతుంటావు. శివాలయంలో అంటే నా తండ్రి నివసించే ఆలయంలో కేవలం తీర్థం మాత్రమే ప్రసాదంగా ఇస్తారు కదా! నా తండ్రి జన్మదినం నాడు భక్తులంతా ఉపవాసం కూడా ఉంటారు. నా తండ్రి సామాన్య జీవితం గడప డానికే ఇష్టపడతాడు. నేను కూడా అంతేనమ్మా. అందుకే నాకు పెట్టే నైవేద్యం అందరికీ అరగడానికి అనువుగా, అందరికీ అందుబాటు లో ఉండే విధంగా నిర్ణయించిన మహాను భావుడు ఎవరో కాని, ఆయనకు శతకోటి వందనాలమ్మా. భక్తితో చేసే నా పూజకు అసలు ఖర్చే ఉండదమ్మా. పిల్లలంతా తోటల లోకి వెళ్లి, రకరకాల ఆకులు కోసుకు వస్తే చాలు. ఏవీ దొరక్కపోతే, నాలుగు గడ్డి పరకలు తెచ్చినా చాలు సంతోషిస్తాను. నా తయారీ కూడా అలాగే సులువుగా ఉండాలి. బంకమట్టితో నన్ను తయారు చేస్తే చాలు. సామాన్యుడి దగ్గర నుంచి సంపన్నుల దాకా అందరికీ అందుబాటు లో ఉండే పూజ కదమ్మా నాది. నా మీద ప్రేమతో ముత్తుస్వామి దీక్షితార్‌ ‘వాతాపి గణపతిం భజే’, ‘మహాగణపతిం మనసాస్మరామి’ అంటూ... రచించిన కీర్తనలను నేటి తరం కూడా పాడు కోవాలనే ధ్యేయంతో కొందరు వీటికి ఆధునిక పోకడలను సైతం సంత రించారు.  
– డా. వైజయంతి పురాణపండ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top