నిస్వార్థ ప్రేమ!

Unselfish love spirit - Sakshi

ఆత్మీయం

దేశ సంచారం చేస్తున్న ఒక జ్ఞానికి ఒక మామిడి పండు దొరుకుతుంది. ఆ మామిడిపండు ప్రత్యేకత ఏమిటంటే, ఆ పండు తిన్న వారి ఆయుష్షు పెరుగుతుంది. విషయం తెలిసిన జ్ఞాని ఆ పండును తాను తినడం కన్నా ప్రజలకు మేలు చేసే రాజు తింటే మంచిదని అనుకుంటాడు. అనుకున్నదే తడవుగా జ్ఞాని తనంతట తానుగా రాజసభకు రాజుకిస్తాడు. రాజు ఆ పండు తీసుకుని తాను తినడం కన్నా తనను ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న భార్యకు ఇస్తే బాగుంటుంది కదా అనుకుని ఆమెకు ఇస్తాడు.

అయితే ఆమె దానిని తినకుండా కుంటివాడైనా తన శక్తియుక్తులతో గుర్రపుస్వారీలో విశేష ప్రతిభతో తనను ఆనందపరచిన గుర్రపురౌతుకు ఇస్తుంది. ఆ వికలాంగ రౌతు ఆ పండు తీసుకుని తన భార్య దీర్ఘకాలం జీవించాలనే ఆశతో ఆమెకు ఇస్తాడు. ఆమెది ఎంతో గొప్పమనసు అని, తనకన్నా ఆమె దీర్ఘకాలం జీవిస్తే బాగుంటుందని అనుకుంటాడు. తాను అవిటివాడిని.... తన వల్ల ఎవరికి ఏం లాభముంటుంది అనుకుని ఆ పండుని తన భార్యకు ఇస్తాడు. కానీ ఆమె ఈ దేశాన్ని పాలిస్తున్న రాజుకు ఇస్తే ఆయన ఆయుష్షు పెరిగి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందనుకుని అనుకుంటుంది. ఆమె రాజుకు పండు ప్రాధాన్యాన్ని చెప్పి ఇమ్మంటుంది తమ భర్తను. అతను అలాగే అని ఆ పండు తీసుకువెళ్ళి  రాజుకు అందజేస్తాడు.  

మామిడి పండు తిరిగి తన చేతికి రావడం తెలిసి రాజు ఆశ్చర్యపోతాడు. మరుసటిరోజే రాజు రాజ ్యపాలనను కొడుకుకి అప్పగించి సన్యసిస్తాడు.
ప్రేమ అనేది ఏదో ఆశించి, లోలోపల ఏదో అనుకుని స్వార్థచింతనతో కూడినదై ఉండకూడదనేదే ఈ కథ సారాంశం. ఆశించడానికి అతీతంగా ఉండాలి ప్రేమ. అప్పుడే ప్రేమతోపాటు ప్రేమను ప్రేమించే వ్యక్తులూ విజయం సాధిస్తారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top