
తక్కువ నీటితో ఎక్కువ పంట పండించగలిగితే పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడం సాధ్యమవుతుంది. సరిగ్గా ఇదే దిశగా బిల్ అండ్ మెలిండా గేట్స్తో పాటు కొన్ని అంతర్జాతీయ సంస్థలు చేస్తున్న పరిశోధనలు సత్ఫలితాలు సాధిస్తోంది. మొక్కల్లో సూర్యరశ్మిని ఇంధనంగా మార్చుకునే కిరణజన్య సంయోగ ప్రక్రియను మరింత సమర్థంగా జరిగేలా చేయడం ద్వారా పంటల దిగుబడి పెంచవచ్చునని.. అదేసమయంలో నీటి వాడకాన్ని తగ్గించవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త స్టీఫెన్ లంగ్ ఇకెన్బెర్ర తెలిపారు. మొక్కల్లోని ఒక ప్రొటీన్ మోతాదును పెంచడం ద్వారా అవి ఆకుల్లోని స్టొమాటాను మూసుకునేలా చేయగలిగామని.. తద్వారా నీరు ఆవిరి కాకుండా ఆపగలిగామని ఆయన వివరించారు.
ఈ స్టొమాటా తెరుచుకున్నప్పుడు గాల్లోని కార్బన్ డయాక్సైడ్ లోనికి చేరి ఇంధనంగా మారుతుంది. అదేసమయంలో నీరు ఆవిరి రూపంలో బయటకు వెళ్లిపోతుంది. ప్రోటీన్ మోతాదు పెరగడం వల్ల స్టొమాటా పూర్తిగా తెరుచుకోదని.. తగినంత కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకోగలగదని వివరించారు. ఈ క్రమంలోనే దిగుబడి కూడా 20 శాతం వరకూ ఎక్కువవుతుందని గతంలో జరిగిన పరిశోధనలు రుజువు చేశాయని చెప్పారు. తాము పొగాకు మొక్కను నమూనాగా తీసుకుని ప్రయోగాలు చేశామని.. ఫలితాలను ఇతర ఆహార పంటల్లోనూ సాధించగలమని వివరించారు.