కారుచీకటి.. సూర్యుడి కిరణం కూడా చొరబడటానికి వీల్లేని ప్రదేశం.. అప్పుడప్పుడూ వినిపించే గబ్బిలాల శబ్దాలు తప్ప లోపలంతా నిశ్శబ్దం. అవే పర్యాటక కేంద్రాలుగా భాసిల్లే గుహలు. జీవం మనుగడకే సాధ్యం కాని ఆ రాతిగోడల మధ్య మానవాళి ప్రాణాలను కాపాడగల ఒక అద్భుతమైన సూక్ష్మజీవుల సామ్రాజ్యం నిశ్శబ్దంగా పెరుగుతోందని మీకు తెలుసా? అవును నిశీధిలో దాగున్న ఈ కంటికి కనిపించని జీవులే రేపటి వైద్య రంగానికి సరికొత్త దిక్సూచి కాబోతున్నాయి. భారతదేశంలో ఉన్న 1,500కు పైగా సహజ గుహల్లో పెరిగే సూక్ష్మజీవులు భవిష్యత్తులో ప్రాణాంతకమైన వ్యాధులకు సరికొత్త యాంటీబయాటిక్స్ అందించడమే కాకుండా.. అంతరిక్ష పరిశోధనలకు, పర్యావరణ శుద్ధికి కూడా కీలకం కానున్నాయని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఆ విశేషాలేంటో చూద్దామా?
ప్రతి గుహలో ఒక విలక్షణమైన జీవావరణం
గోవాలోని క్యూపెమ్ ప్రభుత్వ కళాశాల బోటనీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ సుజాత దబోల్కర్ రాసిన పరిశోధన వ్యాసం ఇటీవల ప్రముఖ ‘జియో మైక్రోబయాలజీ జర్నల్’లో ప్రచురితమైంది. భారతదేశంలోని గుహలు కేవలం పర్యాటక ప్రాంతాలు మాత్రమే కాదని, అవి అపార జీవవైవిధ్యానికి నిలయాలని ఆమె నిరూపించారు. ఆహారం దొరకని, సూర్యరశ్మి సోకని క్లిష్ట పరిస్థితులను తట్టుకొని ఆస్పెర్గిల్లస్, పెన్సిలియమ్, క్లాడో స్పోరియమ్ వంటి ఫంగస్ రకాలు మన గుహల్లో జీవిస్తున్నాయి.
ఇవి గుహల్లోని రాళ్లను, ఖనిజాలను ఆహారంగా మార్చుకుంటూ ప్రత్యేకమైన ఎంజైమ్లను విడుదల చేస్తూ సొంతంగా ఒక మైక్రో ఎకో సిస్టమ్నే సృష్టించుకుంటున్నాయి. అలాగే మేఘాలయలోని సున్నపురాయి గుహలు, ఆంధ్రప్రదేశ్లోని బొర్రా గుహలు, ఛత్తీస్గఢ్లోని కోటమ్సర్ గుహ, గోవాలోని లాటరైట్ గుహలు, దక్కన్ ప్రాంతంలోని అగ్నిపర్వత గుహలు.. ఇలా ప్రతి భూగర్భ వ్యవస్థకు దాని సొంత సూక్ష్మ జీవావరణ వ్యవస్థ ఉంది.
యాంటీబయాటిక్స్ విప్లవం
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు బాక్టీరియాలు మందులకు లొంగకపోవడం. ఈ గుహల్లోని శిలీంధ్రాలు వేల ఏళ్లుగా ఇతర సూక్ష్మజీవులతో పోటీ పడుతూ, వాటిని ఎదుర్కోవడానికి తమలో తాము శక్తివంతమైన రసాయన రక్షణలను అభివృద్ధి చేసుకున్నాయి. ఇవే ఇప్పుడు తదుపరి తరం యాంటీబయాటిక్స్ తయారీకి మూలస్తంభాలు కావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్య కారకాలను, ప్రమాదకర రసాయనాలను విచ్ఛిన్నం చేయగల ఎంజైములు కూడా ఈ ఫంగస్లలో ఉన్నాయి. బయోటెక్నాలజీ రంగంలో ఇవి సరికొత్త పారిశ్రామిక విప్లవానికి దారితీస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
అంగారకుడిపై మనుగడ సాధ్యమేనా?
ఈ అధ్యయనం కేవలం భూమికి మాత్రమే పరిమితం కాలేదు. గుహలలోని ఈ జీవుల సహన శక్తి ఆస్ట్రోబయాలజిస్టులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. తీవ్రమైన రేడియేషన్, వనరులు లేని కఠిన పరిస్థితులను తట్టుకోగల ఈ శిలీంధ్రాల లక్షణాలను బట్టి చూస్తే, భవిష్యత్తులో మానవుడు అంగారక గ్రహం లేదా మంచుతో నిండిన యూరోపా (గురుడి ఉపగ్రహం) వంటి చంద్రులపై అడుగుపెట్టినప్పుడు, అక్కడ జీవం మనుగడకు ఇవే ఆధారాలు కావచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి భారతదేశంలోని గుహలు సైన్స్ రంగానికి ఒక సరికొత్త సరిహద్దుగా నిలిచాయి. నిశీధిలో దాగి ఉన్న ఈ చిన్నజీవులు మానవాళి భవిష్యత్తుకు వెలుగులు ఇవ్వనున్నాయి.


