టీలో కొంచెం ఉప్పు ఎక్కువైంది! | literature Bites | Sakshi
Sakshi News home page

టీలో కొంచెం ఉప్పు ఎక్కువైంది!

Mar 19 2018 1:13 AM | Updated on Aug 13 2018 7:54 PM

literature Bites - Sakshi

సాహిత్య మరమరాలు

స్థానాపతి సత్యనారాయణ, కన్యకాపరమేశ్వరి దేవాలయంలో వంశపరంపరలో పూజారి. ఆ దేవాలయాన్ని అంటుకునివున్న చిన్న ఇల్లు పూజారి వసతి గృహం. అందులోనే ఆయన ఉండేవారు. బలిష్టమైన మనిషి. పహిల్వాన్‌ కావాలని కాంక్ష ఉండేదట. ఆయన దగ్గరికి అబ్బూరి వరదరాజేశ్వరరావు తెలుగు, సంస్కృతం అభ్యసించేందుకు వెళ్లేవారట. అయితే, చదువు చెబుతూ తన దగ్గర చదువుకోవటమే ఒక సరదా అనే అనుభూతిని కలిగించాలని సత్యనారాయణ తాపత్రయపడేవారు. 

ఆ ఉత్సాహంలో వరదను ఒకసారి కోట ప్రాంతంలో బీచ్‌రోడ్‌ మీద వున్న ఒక రెస్టారెంటుకు కాఫీ తాగుదామని తీసుకెళ్లారు. ఆ రోజుల్లో దానిని ఇంగ్లీష్‌ వాళ్లు నిర్వహించేవారు. అలాంటి చోట్లకు పోవడం సత్యనారాయణకు మొదటిసారి. బల్లమీద టేబుల్‌ సాల్టూ, సాసూ వున్నాయి. వెయిటర్‌ వాళ్లు కూచున్న టేబుల్‌ దగ్గరికి వచ్చి యేంకావాలన్నాడు. ఇంట్లో ఎటూ రోజూ కాఫీయే కదా, ఇక్కడ కూడా అదేనా అని, రెండు కప్పులు టీ పట్రమ్మని చెప్పారు సత్యనారాయణ. 

రెండు కప్పుల టీ తెచ్చాడు వెయిటరు. పంచదార విడిగా ఇచ్చాడు. అది కలుపుకొని తాగాడు వరద. సత్యనారాయణ బాధగా తాగారు. బిల్లు చెల్లించి, రోడ్డు మీదకు వచ్చాక, ‘‘ఏమిటోయ్, ఇంగ్లీషువాళ్ల టీ ఉప్పగా ఉంటుందేమోయి’’ అన్నారట సత్యనారాయణ. పంచదార అనుకుని, తన కప్పు పక్కనేవున్న టేబుల్‌ సాల్ట్‌ అయిదారు చంచాలు ఆయన టీలో కలుపుకున్నారు పాపం!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement