కళాత్మకం : త్యాగ‘రాగ’ బ్రదర్స్! | hyderabad brothers gets central music and drama academy award | Sakshi
Sakshi News home page

కళాత్మకం : త్యాగ‘రాగ’ బ్రదర్స్!

Nov 26 2013 11:06 PM | Updated on Oct 30 2018 5:50 PM

కళాత్మకం :  త్యాగ‘రాగ’ బ్రదర్స్! - Sakshi

కళాత్మకం : త్యాగ‘రాగ’ బ్రదర్స్!

‘హైదరాబాద్ బ్రదర్స్’గా విఖ్యాతులైన దరూరి రాఘవాచారి-శేషాచారి సోదరులు నాలుగు దశాబ్దాలకు పైగా కర్ణాటక సంగీతం ద్వారా చేస్తోన్న కళాసేవ అనితరం, అవిభాజ్యం! కాబట్టే కేంద్ర సంగీత నాటక అకాడెమీ ఇద్దరికీ సంయుక్తంగా అవార్డు ప్రకటించింది.

 ‘హైదరాబాద్ బ్రదర్స్’గా విఖ్యాతులైన దరూరి రాఘవాచారి-శేషాచారి సోదరులు నాలుగు దశాబ్దాలకు పైగా కర్ణాటక సంగీతం ద్వారా చేస్తోన్న కళాసేవ అనితరం, అవిభాజ్యం! కాబట్టే కేంద్ర సంగీత నాటక అకాడెమీ ఇద్దరికీ సంయుక్తంగా అవార్డు ప్రకటించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఆనంద్‌నగర్‌లోని తమ నివాసంలో ‘సాక్షి’ ప్రతినిధికి ఇచ్చిన  ఇంటర్వ్యూలోని విశేషాంశాలు...
 
 హిందుస్తానీ ఆకాశంలో ప్రకాశించిన రత్నం!
 కర్ణాటక సంగీత వాగ్గేయకారులు త్యాగరాజు నుంచి సంగీత స్రవంతి మా కుటుంబంలో ప్రవహిస్తోంది. త్యాగరాజు ప్రత్యక్ష శిష్యులు తచ్చూర్ సింగరాజాచార్యులు. వారి శిష్యులు రాఘవాచార్యులు. వారి శిష్యురాలు దరూరి సులోచనమ్మ. ఆమె మా అమ్మ. నాన్న దరూరి రత్నమాచార్యులు నిజాం ఆస్థానంలో కర్ణాటక సంగీత విద్వాంసులు. హైదరాబాద్ స్టేట్‌లో హిందుస్తానీ విద్వాంసులే ఎక్కువ. ఆ నేపథ్యంలో నాన్న రత్నమాచార్యులు నిజాం విశేష ఆదరణను చూరగొన్నారు. నాయనమ్మ తాయారమ్మ సంగీతం టీచర్. మాది పక్కా హైదరాబాదీ కుటుంబం. నాన్న హయత్‌నగర్‌లో జన్మించారు. మా బాల్యం యాకుత్‌పురాలో గడచింది.
 
 ఆచార్యదేవులు మాతా-పితలే...
 ‘నాదం’తో మా బాల్యం మొదలైంది. కర్నాటక సంగీతాన్ని నేర్పే అరుదైన వ్యక్తులుగా హైదరాబాద్‌లో అమ్మా, నాన్నలకు ప్రత్యేకమైన గౌరవం. ఈ నేపథ్యంలో మా అమ్మానాన్న దగ్గర సంగీతం నేర్చుకునేందుకు విశేష సంఖ్యలో విద్యార్థులు వచ్చేవారు. వారి  సరసన మేమూ! స్వరాలు-ఆరోహణలు- అవరోహణలు-గమకాలు-తాళం-తాళ ఆవర్తనమ్-లఘు-ధృతమ్-అనుధృతమ్‌లాంటి సింబల్స్ అన్నప్రాసన నుంచి అసంకల్పితంగా ప్రభావితం చేశాయి. ‘గురు దేవో భవ’ అంటే అమ్మానాన్నకూ నమస్కరించినట్లే! (ఇద్దరిలో పెద్దవారైన రాఘవాచారి సుసర్ల శివరాంగారి వద్ద కూడా సంగీతం అభ్యసించారు).
 
 యాదగిరిగుట్టలో స్వరంగేట్రం!
 యాదగిరిగుట్ట శ్రీలక్షీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నాన్న కచేరీ ఇచ్చారు. ఆ సందర్భంలో తొమ్మిదవ ఏట మేము కూడా కొన్ని కీర్తనలు పాడాం. విడివిడిగానే! త్యాగరాయగానసభలో, రవీంద్రభారతిలో, రాష్ట్రంలోని వివిధ వేదికలపై దాదాపు రెండు దశాబ్దాలు విడివిడిగానే గాత్ర కచేరీలు ఇచ్చాం. 1980వ సంవత్సరంలో ఒక అసంకల్పిత ఘటన మమ్ములను వేదికపై యుగళ గాత్రజ్ఞులను చేసింది. త్యాగరాజస్వామి జన్మస్థలమైన తిరువాయూర్‌లో ఆరాధనోత్సవాలలో పాల్గొనేందుకు ఇద్దరం అభ్యర్థ్ధన పంపాం. ప్రపంచంలోని కర్ణాటక సంగీత ప్రముఖులందరూ పాల్గొనే విశేషోత్సవం కదా, నిర్వాహకులు మాకు 15 నిమిషాలు మాత్రమే కేటాయించారు. హంసధ్వని రాగం, ఆదితాళంలో త్యాగరాజకీర్తన ‘రఘునాయకా నీ పాదయుగ రాజీవముల నే విడజాల...’తో గళం విప్పాం. ఒక నిమిషం ముందుగా కచేరీ ముగించిన మాకు నిర్వాహకులు మరో అరగంట అవకాశం ఇచ్చారు! త్యాగరాజ కృపతోనే ఇద్దరం కలసి పాడడం సంభవించిందని భావిస్తూ ఇప్పటికీ ఆ సంప్రదాయాన్ని పాటిస్తున్నాం. ఆ సందర్భం గుర్తొచ్చినపుడల్లా ‘దొరకునా ఇటువంటి సేవ’ అనుకుంటాం! దేశవ్యాప్తంగా వివిధ దేశాల్లో అసంఖ్యాక కచేరీలు ఇచ్చాం. అన్నీ సంతోషాన్నిచ్చినవే. చెన్నైలో కృష్ణగానసభ కచేరీ సందర్భంగా విచ్చేసిన రసజ్ఞులైన శ్రోతల అభినందన మాత్రం మరచిపోలేనిది.
 
 ఏ.పి.భవన్‌లో ‘బ్రదర్స్’ జననం!
 కలసి కచేరీలు ఇచ్చినప్పటికీ మమ్మల్ని ‘రాఘవాచారి-శేషాచారి’ల కచేరీగానే వ్యవహరించేవారు. త్యాగరాయ ఆరాధనోత్సవాల సందర్భంగా టూరిజం ఉన్నతాధికారి కిషన్‌రావు 1988 ప్రాంతంలో ఢిల్లీలోని ఎ.పి.భవన్ శ్రోతలకు మమ్మల్ని పరిచయం చేస్తూ ‘హైదరాబాద్ బ్రదర్స్’ అన్నారు. మా పేర్లు వెనుకబడి ‘బాంధవ్యం’ ప్రాచుర్యంలోకి వచ్చింది. సంతోషమే, తండ్రి, తాతలు పుట్టిన ఊరు కదా! అవార్డులు కళావ్యాప్తికి దోహదం చేస్తాయిఏవో అవార్డులు వస్తాయని సంగీతం నేర్చుకోలేదు. లలితకళల్లో ఏ కళ అయినా స్వభావరీత్యా అలవడాలి. కుటుంబవాతావరణం దోహదం చేస్తుంది. అవార్డుల వలన కళాసేవ చేసే అవకాశం మెరుగు పడుతుంది. ఆలిండియా రేడియోలో టాప్‌గ్రేడ్ ఆర్టిస్టులం అనే గుర్తింపు కొందరు శిష్యులను ఆకర్షించింది.
 
  సంగీత కళామణి, సంగీత చూడామణి, కళారత్న (హంస) తదితర అవార్డులు వచ్చిన సందర్భాల్లో,  తమ పిల్లలకు సంగీతం నేర్పడానికి సంప్రదించే తల్లిదండ్రుల సంఖ్యను పెంచింది. శ్రీపాద పినాకపాణి, బాలమురళి, నేదునూరి కృష్ణమూర్తి, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యంగార్, డి.కె.పట్టమ్మాళ్ తదితరుల ప్రభావం, శుభాశీస్సులు మాపై ఉన్నట్లే మా దగ్గర కర్ణాటక సంగీతం నేర్చుకునే శిష్యులపై కూడా ఉండాలని ‘త్యాగబ్రహ్మ’ను ప్రార్థిస్తున్నాం.
 - పున్నా కృష్ణమూర్తి
 
 ఇద్దరం కలసి కచేరీలు ఇచ్చినప్పటికీ రాఘవాచారి-శేషాచారిల కచేరీగానే వ్యవహరించేవారు. త్యాగరాయ ఆరాధనోత్సవాల సందర్భంగా టూరిజం ఉన్నతాధికారి కిషన్‌రావు 1988 ప్రాంతంలో ఢిల్లీలోని ఎ.పి.భవన్ శ్రోతలకు మమ్మల్ని పరిచయం చేస్తూ ‘హైదరాబాద్ బ్రదర్స్’ అన్నారు!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement