మాది ప్రజాపక్షం | Sakshi
Sakshi News home page

మాది ప్రజాపక్షం

Published Mon, May 19 2014 1:04 AM

మాది ప్రజాపక్షం - Sakshi

  • విజయవాడ ‘పశ్చిమ’ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్
  •  విజయవాడ, న్యూస్‌లైన్ : అక్రమాలు చేయడం, మాయమాటలు చెప్పడం వల్లే టీడీపీ అధినేత చంద్రబాబుకు గెలుపు సాధ్యమైందని వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు, పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ చెప్పారు. ప్రజాతీర్పును గౌరవిస్తామని, ప్రజాపక్షం వహించి వారి సమస్యలపై ఆలుపెరుగని పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. తారాపేటలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జలీల్‌ఖాన్ మాట్లాడారు.

    తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో  కొత్తగా స్థానికేతరులను ఓటర్లుగా చేర్పించి అధర్మ రాజకీయాలకు పాల్పడిందని గుర్తుచేశారు. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న చంద్రబాబు ఎలాగైనా ముఖ్యమంత్రి కావాలని విచ్చలవిడిగా నగదు పంపిణీ చేసి అక్రమ పద్ధతులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఒంటరి పోరాటం చేసిన వైఎస్సార్ సీపీని  ఎదుర్కోలేక చంద్రబాబు మోడీని, పవన్‌కల్యాణ్‌లతో జతకట్టి అధర్మ యుద్ధానికి పాల్పడ్డారన్నారు. చంద్రబాబు నేడు సీమాంధ్రకు మేలు చేస్తారంటే నమ్మే పరిస్థితి లేదన్నారు.
     
    బెజవాడను రాజధాని చేయాలి

    చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావుపై ఏమాత్రం గౌరవం ఉన్నా, సీమాంధ్ర అభివృద్ధిపై  చిత్తశుద్ధి ఉన్నా అన్ని అర్హతలున్న విజయవాడను కొత్త రాష్ట్రానికి రాజధాని చేయాలని జలీల్‌ఖాన్ డిమాండ్ చేశారు. విజయవాడ-గుంటూరు మధ్యనే హైకోర్టును ఏర్పాటు చేయాలని కోరారు. ఎమ్మెల్యేలందరినీ సమదృష్టితో చూసి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు.
     
    నియోజకవర్గ సమస్యలపై పోరాడతా..

    నగరంలో ట్రాఫిక్ సమస్య ప్రధానంగా ఉందని జలీల్‌ఖాన్ చెప్పారు. తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎన్‌హెచ్-9, ఎన్‌హెచ్-5ను కలపాలని, అవసరమైన చోట్ల ఫ్లైవోవర్లు నిర్మించాలని అసెంబ్లీలో చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానని గుర్తుచేశారు. నగరాన్ని బుడమేరు ముంపు సమస్య వెంటాడుతోందని, దాని శాశ్వత పరిష్కారానికి ఆయనపై ఒత్తిడి తీసుకొస్తానని వివరించారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంలో నాటి పాలకులు అనేక అవకతవకలకు పాల్పడ్డారని, దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టి త్వరితగతిన దాని నిర్మాణం పూర్తి చేస్తానన్నారు.
     
    అందరి అండతోనే గెలిచా..

    తనకు మైనార్టీ, ఎస్సీ వర్గాలతోపాటు ఆర్యవైశ్యులు, నగరాలు, బీసీలు, ఎస్టీలు తదితర  వర్గాల ప్రజలు అండగా నిలిచారని, వారి అభ్యున్నతి కోసం పాటుపడతానని జలీల్‌ఖాన్ వివరించారు.
     

Advertisement
Advertisement