విద్య, వైద్యం, విద్యుత్‌కు పెద్దపీట | eduction,helth, electricity more importance | Sakshi
Sakshi News home page

విద్య, వైద్యం, విద్యుత్‌కు పెద్దపీట

Apr 11 2014 3:04 AM | Updated on Jul 11 2019 5:01 PM

సీమాంధ్ర తొలి సీఎంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వైద్యం, విద్య, విద్యుత్ పథకాలపై ప్రత్యేక దృష్టిసారించి వాటికి పెద్దపీట వేస్తారని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు.

 కోవూరు, న్యూస్‌లైన్: సీమాంధ్ర తొలి సీఎంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వైద్యం, విద్య, విద్యుత్ పథకాలపై ప్రత్యేక దృష్టిసారించి వాటికి పెద్దపీట వేస్తారని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ములమూడి వినోద్‌రెడ్డి నివాసంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

నిరుపేదకు ఆరోగ్యం హక్కుగా చేసి ప్రతి జిల్లాలో ఒక సూపర్‌స్పెషాలిటీ వైద్యశాలను నిర్మిస్తారన్నారు. వైద్యం సకాలంలో అందక ప్రజలు ఇబ్బందులు పడకుండా రొటేషన్ పద్ధతిలో వైద్యులు అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో పనిచేసేలా చూస్తామన్నారు. ప్రభుత్వ వైద్యులు హెడ్‌క్వార్టర్‌లో ఉండేలా సౌకర్యం కల్పిస్తామన్నారు. మహిళలకు ప్రత్యేక లేబర్‌రూమ్‌లను ఏర్పాటు చేస్తామని ప్రసన్నకుమార్‌రెడ్డి చెప్పారు. కాన్పుల కోసం అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు.  

 ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు
 ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది ఉపాధ్యాయులను నియమించేలా తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రణాళికలు తయారు చేస్తున్నారన్నారు. శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల భవనాలను గుర్తించి కొత్తవి నిర్మిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ , బీసీ వసతిగృహాలకు సంబంధించిన పక్కా భవనాలు లేక అద్దె భవనాల్లో కొనసాగిస్తున్నారన్నారు.

అలాంటి వాటికి స్వస్తి పలికి ప్రభుత్వ వసతిగృహాలను ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు అన్ని వసతులు కల్పించి  ఉత్తమ విద్యార్థులుగా ఎదిగేందుకు కృషి చేస్తామన్నారు. సీమాంధ్రలో ఒక్క రాజధాని నగరంలోనే 20 సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలను కట్టించేందుకు జగన్ సిద్దంగా ఉన్నారన్నారు.  

 విద్యుత్ సమస్య లేకుండా..
 2019 నాటికి జగన్ పాలనలో కరెంటు కోతలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతామన్నారు. రైతులకు పగటి పూట 7 గంటలు నాణ్యమైన విద్యుత్‌ను అందించనున్నట్టు చెప్పారు. వీలైతే దానిని 9 గంటలకు పెంచేం దుకు ప్రయత్నిస్తామన్నారు.

 నెలకు 150 యూనిట్లకు రూ.100 మాత్రమే బిల్లు చెల్లించేలా చర్యలు తీసుకొంటామన్నారు. ఈ కార్యక్రమంలో పచ్చిపాల రాధాకృష్నారెడ్డి, నిరంజన్‌బాబురెడ్డి, మల్లికార్జునరెడ్డి, నరసింహులురెడ్డి, సుబ్బారెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, పడుగుపాడు సర్పంచ్ గడ్డం రమణమ్మ , అట్లూరి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement