ధరలు పెంచి.. నిబంధనలు మార్చి.. దోపిడీకి స్కెచ్
మార్కెట్ ధరల కంటే దాదాపు 40శాతం అధికంగా టెండర్ ధరలు
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారుకు ప్రతి పనిలో.. టెండర్లో దోచుకో..పంచుకో.. తినుకో (డీపీటీ) అలవాటుగా మారింది. అంచనాలు పెంచేయడం.. కమీషన్లు కొట్టేయడం రివాజుగా మారింది. లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యాశాఖ పరిధిలోని కేజీబీవీల్లో చదివే పిల్లలకు అందించే సరకుల రేట్లు కూడా పెంచేసి డీపీటీ విధానానికి తెరలేపారు. ఈ టెండర్ల వ్యవహారంలో పెద్ద తలకాయలు జోక్యం చేసుకోవడంతో అధికారులు మార్కెట్లో లభిస్తున్న ధరలతో సంబంధం లేకుండా కాంట్రాక్టర్లు వేసిన ధరలకే టెండర్లు ఖరారు చేసేశారు. మార్కెట్లో కొనుగోలు చేస్తేనే ధరలు తక్కువగా ఉన్నాయి.
కానీ టెండర్లలో ఇలా పెంచేయడం దోపిడీ కాక మరేంటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కోనసీమ జిల్లా రావులపాలెంకు చెందిన విక్టరీ బజార్, విశాఖకు చెందిన విఘ్నేశ్వర ఎంటర్ప్రైజెస్లతో పాటు నేషనల్ కో–ఆపరేటివ్ కన్జూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లకు మొత్తం రూ.178 కోట్ల విలువైన టెండర్లను కట్టబెట్టేశారు. ధరల పెంపుపై ఆరోపణలు వస్తున్నా, ఫిర్యాదులు అందినా అధికారులు పట్టించుకోలేదు. ఈ నెల 16 నుంచి సరుకులు సరఫరా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
సిండికేట్కు జీ హుజూర్
పేద, అనాథ బాలికలు చదివే కేజీబీవీలకు సరుకులు సరఫరా చేసే టెండర్లలో చిరువ్యాపారులు పాల్గొనకుండా నిబంధనలు విధించారు. ఈ వ్యవహారంలో అధికార పారీ్టకి చెందిన నేతల ఒత్తిడి పనిచేసిందన్నది బహిరంగ రహస్యం. 20 వేల చదరపు అడుగుల గోడౌన్, 20 సొంత వాహనాలు ఉండాలనే నిబంధన పెట్టి సిండికేట్కు కట్టబెట్టేశారు. విజిలెన్స్ కేసులున్న కేంద్రీయ భండార్కి టెండర్ కట్టబెట్టడమే దోపిడీ పర్వానికి నిదర్శనమని పేర్కొంటున్నారు. మార్కెట్లో లభించే ధరల కంటే దాదాపు 40 శాతం అధికంగా టెండర్లు ఖరారు చేశారు.
మధ్యాహ్న భోజనం కంటే అధికంగా కోడిగుడ్డు ధర చెల్లింపు మిడ్ డే మీల్కి గుడ్డు రూ.6.20.. కానీ కేజీబీవీకి మాత్రం రూ.7.5

ధరలు పెంచేసి.. జోన్ల వారీగా విభజించి..
మార్కెట్లో కొనుగోలు చేస్తే లభించే ధరలను పట్టించుకోని సమగ్ర శిక్ష అధికారులు ఇష్టం వచ్చినట్టు ధరలు ఖరారు చేసి జోన్ల వారీగా విభజించి కట్టబెట్టారు. గతంలో జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాల వారీగా కొనుగోలు కమిటీ ఉండేది. వారు నిర్ణయించిన మేరకు జిల్లాల వారీగా సరకులు సరఫరా చేసేవారు. ఇప్పుడు కేంద్రీకృత విధానానికి తెరలేపారు. జోన్ల వారీగా విభజించడంతో పాటు తమకు అనుకూలమైన వారికి టెండర్లు దక్కేలా నిబంధనలు రూపకల్పన చేయించి ఎల్–1 పేరిట దోపిడీ పర్వానికి ద్వారాలు తెరిచారు.


