విద్యా సమాచారం


13, 14 తేదీల్లో ఉమ్మడి కౌన్సెలింగ్



హైదరాబాద్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో అడ్మిషన్ల కోసం 2015-16 విద్యా సంవత్సరానికి బీవీఎస్సీ, బీఎస్సీ (అగ్రికల్చర్), బీఎస్సీ (హార్టికల్చర్), బీఎఫ్‌ఎస్సీ, బీటెక్(ఫుడ్ టెక్నాలజీ), బీఎస్సీ (కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్) కోర్సుల ఆఖరి ఉమ్మడి కౌన్సెలింగ్ ఈ నెల 13,14 తేదీల్లో జరగనుంది. ఈ కౌన్సెలింగ్ ప్రాంతీయ పరిశోధనా స్థానం ఆడిటోరియం, లాంఫారం, గుంటూరులో జరగనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మాత్రమే అర్హులు.

 

సిద్దిపేట డిగ్రీ కాలేజీకి స్వయం ప్రతిపత్తి


 సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి స్వయం ప్రతిపత్తి (అటానమస్ హోదా) లభించింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఆ కాలేజీని నిర్వహించేందుకు ప్రభుత్వం కమిటీని నియమించింది. ఈ మేరకు గురువారం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ఉత్తర్వులు జారీ చేశారు. క ళాశాల విద్య కమిషనర్ చైర్‌పర్సన్‌గా ఉండే ఈ కమిటీలో ప్రొఫెషనల్ కేటగిరీలో సామాజిక కార్యకర్త ఇరేని శ్రీనివాస్ సురేంద్ర, పారిశ్రామికవేత్తల కేటగిరీలో హెటిరో రీసెర్‌‌చ ఫౌండేషన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రిన్సిపల్ డెరైక్టర్ కె.రత్నాకర్‌రెడ్డి, ప్రభుత్వ నామినీ కేటగిరీలో కళాశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు ఉంటారు.

 

సీట్ల భర్తీని ఆమోదించలేం మల్లారెడ్డి వైద్య కళాశాల పంపిన జాబితాపై ఎన్టీఆర్ వర్సిటీ

హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలో ఉన్న మల్లారెడ్డి వైద్య కళాశాల పంపిన ఎంబీబీఎస్ అడ్మిషన్ల జాబితాను అనుమతించకూడదని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ నిర్ణయించింది. భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) నిబంధనల మేరకు అడ్మిషన్ల గడువు ముగిసిన నేపథ్యంలో వర్సిటీ ఈ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 30 వరకే ఎంబీబీఎస్ అడ్మిషన్లకు గడువు ఉంది. అయితే మల్లారెడ్డి వైద్య కళాశాల ఢిల్లీ హైకోర్టు నుంచి ప్రత్యేక అనుమతులు తెచ్చుకుని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీని ఆశ్రయించింది. అయితే సుప్రీం కోర్టు నుంచి అనుమతులు తెచ్చుకుంటేనే అడ్మిషన్లకు అనుమతిస్తామని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ చెప్పింది. ఈ నేపథ్యంలో తాజాగా మల్లారెడ్డి వైద్య కళాశాల.. యాజమాన్య కోటా సీట్లు(బీ కేటగిరీ), ప్రవాస భారతీయ కోటా(సీ కేటగిరీ) సీట్లను భర్తీ చేసుకుని, ఈ జాబితాను అనుమతించాలని, కోర్టు అనుమతి వచ్చాకే కన్వీనర్ కోటా భర్తీ చేసుకుంటామని బీ,సీ జాబితాను ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి పంపించింది. దీనిపై హెల్త్ వర్సిటీ.. కన్వీనర్ కోటా భర్తీ చేయకుండా యాజమాన్య కోటా సీట్లు, యాజమాన్య కోటా భర్తీ చేయకుండా ప్రవాస భారతీయ కోటా(ఎన్‌ఆర్‌ఐ) సీట్లకు అనుమతి ఇవ్వలేమని తేల్చి చెప్పింది.

 

పాత స్థానాల్లోనే ఉన్న టీచర్ల రిలీవ్


 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీల్లో భాగంగా 2013లో బదిలీ అయినా, పాత స్థానాల్లోనే కొనసాగుతున్న వారిని రిలీవ్ చేయాలని జిల్లా అధికారులను పాఠశాల విద్య డెరైక్టర్ చిరంజీవులు ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టేలా హెడ్‌మాస్టర్లు, మండల విద్యాధికారులకు సూచించాలని పేర్కొన్నారు. విద్యా వలంటీర్లను నియమించినందున, ప్రతి పాఠశాలలో రెగ్యులర్ టీచర్ ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కాగా, పాఠశాల విద్య డెరైక్టర్ ఆదేశాల నేపథ ్యంలో బదిలీ అయినా పాత స్థానాల్లో కొనసాగుతున్న టీచర్లు ఈ నెల 9న కొత్త స్కూళ్లలో చేరాలని పీఆర్‌టీయూ-టీఎస్, ఎస్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకట్‌రెడ్డి, సరోత్తంరెడ్డి, రాజిరెడ్డి, భుజంగరావు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు.

 

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top