కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పాత ఎడ్ల లంకలో కృష్ణా నదిలో పడిపోయి యువకుడు గల్లంతయ్యాడు.
అవనిగడ్డ: శివరాత్రి పండుగ సందర్భంగా కృష్ణా నదిలో స్నానం చేసేందుకు ఇద్దరు స్నేహితులు వెళ్లారు. నీళ్లలోకి దిగిన తర్వాత ప్రవాహధాటికి కొట్టుకుపోయారు. ఇది గమనించిన ఓ వ్యక్తి నీళ్లలోకి దూకి ఒకరి కాపాడగలిగాడు. మరొకరికోసం గాలిస్తూ తానూ మునిగిపోయాడు. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పాత ఎడ్లలంకలో సోమవారం చోటుచేసుకున్న ఈ సంఘటనలో యువకుడు గల్లంతుకాగా, కాపాడటానికి నీళ్లలోకి దూకిన వ్యక్తి అస్వస్థతకుగురై ఆసుపత్రిలో చేరాడు. వివరాల్లోకి వెళితే..
కొవ్వాడ రమణ(18), అతని స్నేహితుడు స్నానం చేసేందుకు కృష్ణానదిలోకి దిగి, ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కొట్టుకుపోయారు. గట్టుమీదున్న అంబేద్కర్ అనే వ్యక్తి వాళ్లను కాపాడేందుకు నదిలోకి దూకాడు. రమణను కాపాడి, అతని స్నేహితుడి కోసం మళ్లీ నదిలోకి వెళ్లాడు. కానీ శ్వాస తిప్పుకోలేక నీట మునిగాడు. సమయానికి అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీమ్ అంబేద్కర్ ను కాపాడింది. గల్లంతైన మరో యువకుడికోసం గాలిస్తోంది.