జిల్లాలో వడదెబ్బ మృతుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. శనివారం కూడా మరో ఇద్దరు వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయారు.
గుత్తి : జిల్లాలో వడదెబ్బ మృతుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. శనివారం కూడా మరో ఇద్దరు వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయారు. గుత్తి ఎస్సీ కాలనీకి చెందిన మాతాంగి రామకృష్ణ(28) పనుల మీద ఎండలో గుత్తి, గుత్తి ఆర్ఎస్లో కలియతిరిగాడు. దీంతో వడదెబ్బకు గురై, సొమ్మసిల్లి కింద పడిపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారని విలపించారు.
మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. తురకపల్లికి చెందిన పెయింటర్ శ్రీనివాసులు(45) సైతం వడదెబ్బకు గురై శనివారం మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. పని ముగించుకుని ఇంటికెళ్తుండగా.. గుత్తి ఆర్టీసీ బస్టాండ్ వద్ద కుప్పకూలిపోయారన్నారు. ఆస్పత్రికి తరలిస్తుండగానే మరణించినట్లు స్థానికులు వివరించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.