కాలయాపనే కారణం.. | The reason for the long time, says district collector report | Sakshi
Sakshi News home page

కాలయాపనే కారణం..

Jul 16 2015 11:36 AM | Updated on May 29 2018 11:47 AM

సీఎం చంద్రబాబుతోపాటు వీవీఐపీలు, వీఐపీలకోసం పుష్కరఘాట్‌ను గంటలతరబడి మూసివేయడం, ఆ తర్వాత ఒక్కసారిగా గేట్లు తెరవడం వల్లనే తొక్కిసలాట జరిగినట్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ నివేదిక స్పష్టంచేస్తోంది.

కాకినాడ: సుదీర్ఘ కాలయాపన వల్లే రాజమండ్రి కోటగుమ్మం పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాట జరిగిందని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ ప్రాథమిక నివేదిక ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు వీవీఐపీలు, వీఐపీల కోసం పుష్కరఘాట్‌ను గంటలతరబడి మూసివేయడం, ఆ తర్వాత ఒక్కసారిగా గేట్లు తెరవడం వల్లనే తొక్కిసలాట జరిగినట్లు ఆయన తన నివేదికలో పేర్కొన్నారు.

గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి 27 మంది మృతి చెందిన దుర్ఘటనపై  జిల్లా కలెక్టర్... రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను పంపించారు. పుష్కరాల ప్రారంభం రోజైన మంగళవారానికి 2రోజుల ముందునుంచే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అలాగే పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు రాజమండ్రికి రావడం ప్రారంభించారని నివేదికలో పేర్కొన్నారు. పుష్కరాలు ప్రారంభం కాగానే నదిలో స్నానం చేయాలనే ఉత్సుకతతో మంగళవారం తెల్లవారు జామునే పెద్ద సంఖ్యలో పుష్కర ఘాట్ కు భక్తులు తరలి వచ్చారని తెలిపారు.

భక్తుల సంఖ్య గంట గంటకు పెరిగిపోయినట్లు పేర్కొన్నారు. అయితే చంద్రబాబుతో పాటు వీవీఐపీ లు, వీఐపీలు ఉదయం 6.26 గంటల నుంచి పుష్కర ఘాట్‌లో ఉన్నారని, గోదావరి పుష్కరాల్లో తొలుత స్నానం చేసి పుష్కరాల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారని కల్టెక్టర్ నివేదిక లో స్పష్టం చేశారు. వారు స్నానాలు పూర్తయ్యి బయటకు వచ్చేసరికి 8.30 గంటలైం దని తెలిపారు. తెల్లవారుజామునుంచి 8.30 గం టలవరకూ భక్తులను అనుమతించకపోవడం తో తాకిడి మరింతగా పెరిగిపోయిందన్నారు.ఆ తర్వాత కూడా ఒక్కగేటునే తెరవడంతో భక్తుల తాకిడితో తొక్కిసలాట జరిగిందని, పోలీసులు నిలువరించలేకపోయారని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ద్వారా జిల్లా కలెక్టర్ తన నివేదికను కేంద్ర హోంశాఖకు పంపారు.

కాగా చంద్రబాబు కార్యక్రమాలు పూర్తయ్యే వరకు భక్తులను నదీలోకి స్నానం చేయడానికి అనుమతించనందునే తొక్కిసలాట జరిగినట్లు దీనిద్వారా తెలుస్తోంది. తెల్లవారు జామునుం చి వచ్చిన వారిని వచ్చినట్లే నదిలోకి స్నానానికి అనుమతించినట్లైతే పెద్ద ఎత్తున భక్తులు గుమికూడటం, తొక్కిసలాట జరిగి ఉండేది కాదని కలెక్టర్ నివేదిక పరోక్షంగా స్పష్టం చేస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement