
బెంగళూరు: బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు.. గురువారం మధ్యాహ్నం విచారణ చేపట్టింది. తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కనీస ఏర్పాట్లు లేకుండా ఈవెంట్ ఎలా నిర్వహిస్తారని ప్రశించిన ధర్మాసనం.. ఈ నెల 10లోపు వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది.
ఇంతటి భారీస్థాయి కార్యక్రమాలు జరుగుతుంటే ఎందుకు భద్రతా చర్యలు తీసుకోలేదంటూ సీజే ప్రశ్నించారు. అన్ని భద్రతా చర్యలు తీసుకున్నామని.. కానీ ఊహించని విధంగా ఘటన జరిగిందని అడ్వకేట్ జనరల్ తెలిపారు. స్టేడియంలో 21 గేట్లు తెరిచారా అంటూ కోర్టు ప్రశ్నించింది. ఘటనపై ప్రభుత్వానికి సంబంధించిన వివరాలను కోర్టుకు అడ్వకేట్ జనరల్ వివరించారు.
భద్రతాపరంగా అన్ని పటిష్టమైన చర్యలు చేపట్టామన్న ఏజీ.. విచారణకు ఆదేశించామని.. 15 రోజుల్లోనే ఘటనపై కోర్టుకు నివేదిక సమర్పిస్తామని తెలిపారు. క్రికెటర్లకు సన్మానం చేయాలని నిర్ణయించింది ఎవరు?. సన్మానం చేయాలనుకుంది ఆర్సీబీనా? కర్ణాటక అసోసియేషనా? లేక ప్రభుత్వమా? అంటూ అడ్వకేట్ జనరల్కు న్యాయవాది సూటి ప్రశ్నలు వేశారు. జరిగిన ఘటనలో వాస్తవాలను కప్పిపుచ్చాలని చూస్తున్నారన్నారు. ఈ నెల 10లోపు వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చిన హైకోర్టు.. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.