‘యాదాద్రి’ ప్లాంటు తరలింపు! | The decision to send a committee of experts to research | Sakshi
Sakshi News home page

‘యాదాద్రి’ ప్లాంటు తరలింపు!

Nov 26 2015 3:35 AM | Updated on Nov 9 2018 5:52 PM

‘యాదాద్రి’ ప్లాంటు తరలింపు! - Sakshi

‘యాదాద్రి’ ప్లాంటు తరలింపు!

నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం, దిలావర్ పూర్లలో నిర్మించ తలపెట్టిన యాదాద్రి సూపర్ క్రిటికల్

దామరచర్ల నుంచి తరలించాలన్న కేంద్రం
♦ ప్రతిపాదిత స్థలం గుండా మూసీ వెళ్తుండటమే కారణం
♦ నదీ జలాలు కలుషితం అవుతాయని ఆందోళన
♦ పరిశీలనకు నిపుణులతో కమిటీని పంపాలని నిర్ణయం
♦ ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడి
♦ రామగుండం ఎన్టీపీసీ విస్తరణపై సైతం కొర్రీలు..  ‘సాక్షి’కి ప్రత్యేకం
 
 సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం, దిలావర్ పూర్లలో నిర్మించ తలపెట్టిన యాదాద్రి సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రం చిక్కుల్లో పడింది. 4,000 (5ఁ800) మెగావాట్ల భారీ సామర్థ్యంతో తెలంగాణ జెన్‌కో తలపెట్టిన ఈ ప్రాజెక్టును దామరచర్ల నుంచి మరో ప్రాంతానికి తరలించే అంశాన్ని పరిశీలిం చాల్సిందిగా కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సూచిం చింది. ప్రతిపాదిత స్థలం మీదుగా కృష్ణా ఉప నది (మూసీ) వెళ్తున్నందున అక్కడ థర్మల్ ప్రాజెక్టు నిర్మిస్తే ఈ జల వనరు ప్రభావితం కావచ్చని ఆందోళన వెలిబుచ్చింది.

కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నేతృత్వం లోని నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) గత నెల 29న ఢిల్లీలో సమావేశమై దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కొత్త థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు అనుమతులు జారీ చేసే అంశంపై ఆయా రాష్ట్రాల అధికారులతో చర్చలు జరిపి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశానికి సంబంధించిన ‘మినిట్స్’ కాపీని ‘సాక్షి’ సంపా దించింది. వివిధ కారణాలతో దామరచర్లలో యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణంతో పాటు కరీంనగర్ జిల్లా రామగుండంలో ఎన్టీపీసీ విస్తరణలో భాగంగా నిర్మించ తలపెట్టిన 1,600 (2ఁ800) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రానికి పర్యావరణ అనుమతులను వాయిదా వేస్తూ ఈ సమావేశంలో ఈఏసీ కమిటీ నిర్ణయం తీసుకుంది. క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు త్వరలో ఓ సబ్ కమిటీని ఏర్పాటు చేసి దామరచర్లకు పంపిస్తామని, ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర అధికారుల బృందానికి తెలియజేసింది.

తెలంగాణ జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్ రావు, డెరైక్టర్ సి.రాధాకృష్ణ ఈ సమావేశానికి హాజరై ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన వివరాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కమిటీ ముందు ఉంచారు. ప్రతిపాదిత స్థలానికి సమీపంలో కృష్ణా ఉప నది వెళ్తుంది గనుక ప్రాజెక్టు అవసరాలకు సరిపడా నీళ్ల లభ్యత సైతం ఉందని రాష్ట్ర అధికారులు వివరించి నట్లు సమాచారం. ఇదే అంశాన్ని పట్టుకున్న కేంద్ర నిపుణుల కమిటీ.. ఉప నది సమీపంలో థర్మల్ కేంద్రాన్ని ఎలా నిర్మిస్తారని ప్రశ్నించి నట్లు తెలిసింది. ప్రాజెక్టును మరోచోటికి తరలించే అంశంపై ఈ సమావేశంలో జెన్‌కో అధికారులతో విస్తృతంగా చర్చించామని ఈ మినిట్స్ నివేదికలో పొందుపరిచారు. ఈ క్రమంలో క్షేత్ర స్థాయి పరిశీలన జరపాలని జెన్‌కో అధికారులు విజ్ఞప్తి చేయగా, సబ్ కమిటీని పంపాలని ఈ నిపుణుల కమిటీ నిర్ణయించింది.

 దామరచర్లలో థర్మల్ ప్రాజెక్టు నిర్మాణా నికి 4,334 హెక్టార్ల అటవీ భూములను పరస్పర భూముల బదలాయింపు విధా నంలో వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రం నుంచి అను మతులు సైతం పొందింది. దామరచర్లలో థర్మల్ ప్రాజెక్టు నిర్మిస్తే స్థానికులకు ఉద్యో గాలు వస్తాయని నల్లగొండ జిల్లా వాసులు ఆశలు పెట్టుకున్నారు. ఈ క్షేత్ర స్థాయి పర్యటన అనంతరం నిపుణుల సబ్ కమిటీ తీసుకునే నిర్ణయమే దామరచర్ల విద్యుత్ కేంద్రం భవితవ్యాన్ని తేల్చనుంది. ఈ అంశంపై జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్ రావు వివరణ కోసం ‘సాక్షి’ ప్రయత్నించగా ఆయన ఫోన్ కాల్‌పై స్పందించలేదు.

 ఎన్టీపీసీ విస్తరణకు అడ్డంకే
 విభజన చట్టం హామీ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సి ఉంది. ఇందులో భాగంగా తొలి విడతగా రామగుండంలో 1,600 మెగావాట్లతో ఎన్టీపీసీ ప్లాంట్ విస్తరణకు సైతం నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) అనుమతులను వాయిదా వేసింది. ఈ ప్రాజెక్టును 44 నెలల్లో పూర్తి చేసేందుకు ఇటీవలే ఎన్టీపీసీ నిర్ణయం తీసుకోగా, తాజా పరిణామాలతో మరింత ఆలస్యం జరగ నుంది. ఎన్టీపీసీ ప్రతిపాదనలపై కమిటీ ఏకంగా 14 కొర్రీలు వేసింది. ఎన్టీపీసీ ప్లాంట్ వల్ల పరిసర ప్రాంతాల్లో ప్రజారోగ్యంపై పడుతున్న ప్రభావంపై అధ్యయనం జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ప్రాజెక్టుకు బొగ్గు కేటాయింపులకు సంబం ధించి సమగ్ర వివరాలు సమర్పించాలని ఆ కమిటీ సూచించింది.

Advertisement
 
Advertisement
Advertisement