నార్బో పర్వతంపై తెలంగాణ సంబురాలు | telangana farmation day in narbo mountain in himachal pradesh | Sakshi
Sakshi News home page

నార్బో పర్వతంపై తెలంగాణ సంబురాలు

Jun 2 2016 3:02 AM | Updated on Sep 4 2017 1:25 AM

నార్బో పర్వతంపై తెలంగాణ సంబురాలు

నార్బో పర్వతంపై తెలంగాణ సంబురాలు

స్వరాష్ట్ర సాధన ఉత్సవాలను అందరిలాగా సాదాసీదాగా జరుపుకోకూడదనుకున్నారో.. ఏమో కొందరు ఔత్సాహికులు ఏకంగా ఓ పర్వత శిఖరాన్ని లక్ష్యంగా చేసుకున్నారు.

నేటి ఉదయం 8:30 గంటలకు శిఖరంపైకి చేరుకోనున్న ఔత్సాహికులు
అక్కడే తెలంగాణ ఆవిర్భావ వేడుకలు... బతుకమ్మ ఆటలు

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: స్వరాష్ట్ర సాధన ఉత్సవాలను అందరిలాగా సాదాసీదాగా జరుపుకోకూడదనుకున్నారో.. ఏమో కొందరు ఔత్సాహికులు ఏకంగా ఓ పర్వత శిఖరాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఎవరికీ అందనంత ఎత్తులో తమ సంతోషాన్ని పంచుకోవాలని, బతుకమ్మ ఆటలు ఆడుకుని తెలంగాణ సంస్కృతిని ఎవరెస్టు శిఖరం ఎత్తుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో సాహసమే అయినా ముందుకు కది లారు. వారికి కొందరు దాతలు అండగా ఉండడంతో క్షేమంగా హిమాచల్‌ ప్రదేశ్‌లోని నార్బో పర్వతం అంచుల వరకు వెళ్లారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్‌ 2న ఉదయం 8: 30 గంటల ప్రాంతంలో వారు ఈ పర్వతంపైకి చేరుకుని అక్కడే సంబురాలు జరుపుకోనున్నారు. వివరాల్లోకి వెళితే...అడ్వంచర్‌ క్లబ్‌ ఆఫ్‌ తెలంగాణ అనే ఓ సంస్థ ఈ పర్వత సంబురాలకు ప్లాన్‌ చేసింది. తెలంగాణ ఆవిర్భావ వేడుకలను భూమి మీద జరుపుకోవడం కన్నా పర్వతాల మీద జరుపుకోవాలన్న ఆలోచనతో 8 మంది సభ్యుల బృందం మే నెలలో హైదరాబాద్‌ నుంచి హిమాచల్‌ ప్రదేశ్‌ బయలుదేరింది.

అక్కడ భూమికి 5,226 అడుగుల ఎత్తులో ఉన్న నార్బో పర్వత ఆరోహణ ప్రారంభించింది. బుధవారం రాత్రి కల్లా నార్బో పర్వత శిఖరానికి అంచున ఫైనల్‌ సమ్మిట్‌ క్యాంపులో 600 అడుగుల దూరంలో ఉందని టీం లైజన్‌ ఆఫీసర్‌ ఐ.విజయలక్ష్మి తెలిపారు. బృందం సభ్యులంతా క్షేమంగా ఉన్నారని, వీరంతా జూన్‌2 ఉదయం 8:30 గంటలకు పర్వత శిఖరానికి చేరుకుని అక్కడే తెలంగాణ సంబురాలు జరుపుకుని, బతుకమ్మ ఆడుతారని ఆమె ‘సాక్షి’కి వెల్లడించారు. అడ్వంచర్‌ క్లబ్‌ ఆఫ్‌ తెలంగాణ మేనేజర్‌ కె. రంగారావు ఈ టీంకు నేతృత్వం వహిస్తుండగా, ఈ బృందంలో ఎ. సత్యనారాయణ (మహాత్మాగాంధీ యూనివర్సిటీ, నల్లగొండ), ప్రవీణ్‌ కుమార్‌ (నారాయణఖేడ్, మెదక్‌), రాజశేఖర్‌ నాయక్‌ (తెలంగాణ యూనివర్సిటీ, నిజామాబాద్‌), ఎం. విశాల్‌శర్మ (నిజామాబాద్‌), ఎ. తుకారామ్‌ ( తక్కెళ్లపల్లి తండా, యాచారం మండలం, రంగారెడ్డి జిల్లా), సుధీర్‌సింగ్‌ (ధూల్‌పేట, హైదరాబాద్‌), టి. నితిన్‌రావు (నిజామాబాద్‌)లు సభ్యులుగా ఉన్నారు. అయితే, ఈ టీంకు నల్లగొండ జిల్లా ఎస్పీగా పనిచేసి ఇటీవలే ఆదిలాబాద్‌ జిల్లాకు బదిలీ అయిన విక్రమ్‌జీత్‌ దుగ్గల్‌ సాయమందించడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement