నారీనారీ నడుమ యుద్ధభేరి | TDP Leaders Internal Fighting in Saluru | Sakshi
Sakshi News home page

నారీనారీ నడుమ యుద్ధభేరి

Apr 27 2016 12:40 AM | Updated on Mar 21 2019 8:35 PM

నారీనారీ నడుమ యుద్ధభేరి - Sakshi

నారీనారీ నడుమ యుద్ధభేరి

శంకుస్థాపనలు జరిగితే అధికార , విపక్షాల మధ్య యుద్ధం జరుగుతుంటుంది. ఆహ్వానాలను పంపడంలో విపక్ష ప్రజాప్రతినిధులకు ఎప్పుడూ చేదు అనుభవమే మిగులుతుంటుంది.

ముదిరిన అధికార పార్టీ ప్రజాప్రతినిధుల పోరు
అభివృద్ధి పనుల శంకుస్థాపన వివాదాస్పదం
సమాచారం అందించలేదన్న  ఎమ్మెల్సీ సంధ్యారాణి
మున్సిపల్ కమిషనర్‌కు ఫోన్‌లో హెచ్చరిక
ఎమ్మెల్సీ వస్తున్నట్టు తెలియదన్న మున్సిపల్ చైర్‌పర్సన్

 
 శంకుస్థాపనలు జరిగితే అధికార , విపక్షాల మధ్య యుద్ధం జరుగుతుంటుంది. ఆహ్వానాలను పంపడంలో విపక్ష ప్రజాప్రతినిధులకు ఎప్పుడూ చేదు అనుభవమే మిగులుతుంటుంది. ఈసారి సంప్రదాయం మారింది. అధికార పార్టీ ఆధ్వర్యంలో జరిగిన శంకుస్థాపనకు సాక్షాత్తు ఆ పార్టీ ఎమ్మెల్సీకే సమాచారం లేకపోయింది. సాలూరులో మంగళవారం జరిగిన అభివృద్ధి పనుల భూమిపూజ వివాదాస్పదమైంది. ప్రొటోకాల్ ప్రకారం సమాచారం ఇవ్వనందుకు ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి మున్సిపల్ కమిషనర్ దాసరి నరసింగరావుపై మండిపడ్డారు. మున్సిపల్ చైర్‌పర్సన్ భూమి పూజ చేసి వెళ్లిపోయూక తాను కొబ్బరికాయ కొట్టి వెనుదిరిగారు. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్న చందాన.. ఏం మాట్లాడితే ఏమవుతుందో తెలియక అధికారులు గుడ్లప్పగించి చూస్తుండిపోయూరు.
 
 సాలూరు : పట్టణంలోని వివిధ వార్డుల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువలు, ప్రహరీల నిర్మాణానికి భూమిపూజ జరిపేందుకు మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేసారు. చైర్‌పర్సన్ గొర్లె విజయకుమారి ఆయా వార్డుల్లో కౌన్సిలర్లతో కలసి భూమిపూజ నిర్వహించారు. 28వ వార్డులోని పెదకోమటిపేటలో పాఠశాల ప్రహరీ నిర్మాణానికి ఆమె భూమిపూజ చేసి వెనుదిరిగిన కాసేపటికే అక్కడికి ఎమ్మెల్సీ సంధ్యారాణి చేరుకున్నారు. చైర్‌పర్సన్ లేకపోయినా కౌన్సిలర్ శోభారాణితో కలసి ఆమె కూడా భూమిపూజ చేసారు.
 
 కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తా
 అనంతరం సంధ్యారాణి సెలవులో ఉన్న మున్సిపల్ కమిషనర్ నరసింగరావుకు ఫోన్‌చేసి ఘాటుగా స్పందించారు. స్థానికంగా నివసిస్తున్న ఎమ్మెల్సీకి ప్రొటోకాల్ ప్రకారం అభివృద్ధి పనుల శంకుస్థాపన సమాచారం ఇవ్వాల్సిన పనిలేదా? అంటూ మండిపడ్డారు.  భూమి పూజకు ఆహ్వానించకపోవడం ప్రొటోకాల్ ఉల్లంఘనేనని, దీనిపై కలెక్టర్ సహా అవసరమైతే శాసనమండలిలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. దీనికి కమిషనర్ బదులిస్తూ తాను సెలవు పెట్టానని, ఏఈకి బాద్యతలప్పగించానని చెప్పారు. కానీ ఏఈ తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఎమ్మెల్సీ స్పష్టం చేసారు. ఉద్యోగ విరమణ దగ్గరలో ఉన్నందున విధులను సజావుగా నిర్వహించాలని, లేకపోతే తీవ్ర ఇబ్బందులు పడతారని హెచ్చరించారు. సొంతపార్టీకి చెందిన చైర్‌పర్సన్ కూడా ప్రొటోకాల్ పాటించకుండా ముఖం చాటేసారని సంధ్యారాణి వర్గీయులు అంటున్నారు.
 
 ఎమ్మెల్సీ వస్తున్నట్టు సమాచారం లేదు
 ఈ విషయూన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ విజయకుమారి వద్ద విలేకరులు ప్రస్తావించగా అభివృద్ధి కార్యక్రమాల భూమి పూజకు ఎమ్మెల్సీ వస్తున్నారన్న సమాచారం తనకు అందలేదన్నారు. వార్డుల్లో విపక్ష కౌన్సిలర్ల కోసం కూడా వేచిఉన్నామని, అలాంటిది సొంతపార్టీ ఎమ్మెల్సీ కోసం ఆగమా? అని బదులిచ్చారు. మున్సిపల్ చైర్‌పర్సన్, ఎమ్మెల్సీల మధ్య కొంతకాలంగా ఉన్న అంతరాలు మరింత ముదిరినట్టు తాజా సంఘటన రుజువు చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement