సాక్షి, నిర్మల్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ వీడింది. ఖానాపూర్ మున్సిపాలిటీ పీఠాన్ని బీజేపీ-బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్పర్సన్గా బీజేపీ కార్పొరేటర్ మౌనిక ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్గా బీఆర్ఎస్ మహమ్మద్ షోయబ్ ఎన్నికయ్యారు.
ఇదిలా ఉండగా.. శనివారం చైర్మన్ ఎన్నిక సందర్భంగా చేతులు ఎత్తే క్రమంలో కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అధికారులతో ఎమ్మెల్యే బొజ్జు, కాంగ్రెస్ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే సమావేశం నుంచి ఎమ్మెల్యే బయటకు వెళ్లిపోయారు. మరోవైపు మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ, బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారులను ఆయన బెదిరిస్తున్నారని ఆక్షేపించారు.
ఖానాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 12 కౌన్సిలర్ స్థానాలు ఉన్నాయి. ఇటీవల ఎన్నికల్లో బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3, స్వతంత్రులు ఒకరు గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థి, ఎక్స్ అఫీషియో ఓటుతో కాంగ్రెస్ బలం ఐదుకు చేరింది. ముందుగా చైర్పర్సన్ ఎన్నిక వేళ బీజేపీ అభ్యర్థి మౌనిక పేరును అధికారులు ప్రతిపాదించారు. దీనిపై ఎమ్మెల్యే బొజ్జు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందుగా బీజేపీ అభ్యర్థి పేరు ఎలా ప్రతిపాదిస్తారంటూ ఆందోళనకు దిగారు. ఈ గందరగోళం నడుమే చైర్మన్ ఎన్నికను అధికారులు ఆదివారానికి వాయిదా వేశారు.


