సిరిసిల్ల జిల్లాకు కదిలిన ప్రజానీకం | sircilla distict Raised | Sakshi
Sakshi News home page

సిరిసిల్ల జిల్లాకు కదిలిన ప్రజానీకం

Aug 19 2016 8:20 PM | Updated on Nov 6 2018 4:04 PM

సిరిసిల్ల జిల్లాకు కదిలిన ప్రజానీకం - Sakshi

సిరిసిల్ల జిల్లాకు కదిలిన ప్రజానీకం

సిరిసిల్ల జిల్లా సాధన ఉద్యమం రోజురోజుకు తీవ్రమవుతోంది. శుక్రవారం పట్టణంలో ప్రజాసంఘాలు, న్యాయవాదులు, రాజకీయపార్టీలు, ముస్లింలు నిరసనలను చేపట్టారు. కామారెడ్డి–కరీంనగర్‌ ప్రధాన రహదారిపై మహాధర్నా, రాస్తారోకో నిర్వహించి ఆటపాటలతో నిరసనలు తెలిపారు.

  • పట్టణంలో తీవ్రమైన ఆందోళనలు
  • ప్రధాన రహదారిపై రాస్తారోకో
  • సిరిసిల్ల టౌన్‌ : సిరిసిల్ల జిల్లా సాధన ఉద్యమం రోజురోజుకు తీవ్రమవుతోంది. శుక్రవారం పట్టణంలో ప్రజాసంఘాలు, న్యాయవాదులు, రాజకీయపార్టీలు, ముస్లింలు నిరసనలను చేపట్టారు. కామారెడ్డి–కరీంనగర్‌ ప్రధాన రహదారిపై  మహాధర్నా, రాస్తారోకో నిర్వహించి ఆటపాటలతో నిరసనలు తెలిపారు. రెండు గంటల పాటు సాగిన రాస్తారోకోతో  కిలోమీటర్‌కు పైగా వాహనాలు నిలిచిపోయాయి. కాంగ్రెస్‌ నాయకుడు మహేందర్‌ రెడ్డితో పాటు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
     –సిరిసిల్లను జిల్లాగా ప్రకటించాలంటూ న్యాయవాదుల కోర్టు ముందు రెండో రోజు రిలేదీక్షలు చేపట్టారు. విద్యార్థులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు, జిల్లా సాధన సమితి నాయకులు దీక్షల్లో పాల్గొంటున్న వారికి సంఘీభావం తెలిపారు. దీక్షల్లో న్యాయవాదులు కోడి లక్ష్మన్, బొంపెల్లి రవీందర్‌రావు, కళ్యాణ చక్రవర్తి, గుంటుక భువనేశ్వర్, ఆడెపు వేణు, దాసరి శ్రీధర్, మొగిలి రాజు, కటుకం బాలకుమార్‌లు పాల్గొన్నారు.
    – జిల్లా సాధన కోరుతూ పట్టణంలో ముస్లింలు శాంతిర్యాలీ నిర్వహించారు. ప్రజాభీష్టాన్ని ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. కార్యక్రమంలో మజీద్‌ కమిటీ అధ్యక్షుడు షేక్‌యూసుఫ్, ఎండీ.సత్తార్, ఇంతియాజ్, ముస్తాఫా, సర్వర్, రియాస్, రఫీయొద్దీన్,   పాల్గొన్నారు.
    కేటీఆర్‌ ఇల్లు ముట్టడి..
    జిల్లా ఏర్పాటుపై ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నా మంత్రి కేటీఆర్‌ స్పందించడం లేదంటూ ఆయన ఇంటిని బీజేపీ, బీజేవైఎం, ప్రజాసంఘాలు ముట్టడించాయి. రాజకీయ జన్మనిచ్చిన సిరిసిల్లను జిల్లా చేయటంలో విఫలమైతున్న కేటీఆర్‌ రాజీనామా చేయాలని వారు డిమాండ్‌ చేసారు. ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే ఆ పార్టీ నాయకులు పదవులను పట్టుకుని వేలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపి పట్టణ అధ్యక్షుడు గౌడ వాసు, నాయకులు అన్నల్‌దాస్‌ వేణు, వెల్ది చక్రపాణి, చందు, కోడం ఆనంద్‌బాబు, అంజన్న, శ్యాం పాల్గొన్నారు.
    ఆస్పత్రిలోనూ ఆమరణదీక్ష
     జిల్లా సాధనకు అంబేద్కర్‌ చౌరస్తాలో అర్బన్‌బ్యాంక్‌  చైర్మన్‌ గాజుల బాలయ్య, రిక్కుమల్ల మనోజ్‌ చేపట్టిన ఆమరణ దీక్ష చేపట్టగా శుక్రవారం ఉదయం పోలీసులు వారి దీక్షలను భగ్నం చేశారు. అరోగ్యం క్షీణించడంతో ఇద్దరిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో వారు ఆహారం తీసుకోకుండా మొండి కేయడంతో వైద్యులు ఫ్లూయిడ్స్‌ అందిస్తున్నారు.  


     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement