పోలీసుల అదుపులో కిడ్నాప్‌ కేసు నిందితులు | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో కిడ్నాప్‌ కేసు నిందితులు

Published Tue, Nov 1 2016 11:04 PM

పోలీసుల అదుపులో కిడ్నాప్‌ కేసు నిందితులు

సాక్షి, రాజమహేంద్రవరం : ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో గత నెల 27న అరసాడ శరత్‌కుమార్‌ కిడ్నాప్‌ అయినట్టు అదే రోజు నమోదైన కేసులో ముగ్గురు నిందితులను ప్రకాశ్‌నగర్‌ పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురు నిందితుల్లో కంపెన సత్యనారాయణ, పుచ్చల సాయికిరణ్, జానకీరామ్‌ను విచారిస్తున్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. గత నెల 27న మాజీ సైనికుడు అరసాడ శరత్‌కుమార్‌ ఏవీ అప్పారావు రోడ్డులో ఉన్న తన అపార్ట్‌మెంట్‌ నుంచి వస్తుండగా కిడ్నాప్‌కు గురయ్యారు. ఆయనను చిత్రహింసలు పెట్టిన నిందితులు రూ.3.5 కోట్ల విలువైన మూడు ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేయించుకుని, అదే రోజు విడిచిపెట్టారు. మూడు ఆస్తుల్లో ఒకటి అప్పటికే శరత్‌కుమార్‌ వేరే వారికి విక్రయించారు. ఈ విషయం తెలిసిన ఆస్తి యజమానులు సోమవారం పిడింగొయ్యి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వచ్చారు. తాము హుకుంపేటలోని 39 సెంట్ల భూమిని శరత్‌కుమార్‌ వద్ద 2016 జూలై 22న కొనుగోలు చేసినట్టు సబ్‌ రిజిస్ట్రార్‌కు తెలిపారు. అందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించి, రిజిస్ట్రేషన్‌ రద్దు చేయాలని విన్నవించారు. కాగా, నిందితుల కోసం గాలిస్తుండగా వారే స్టేషన్‌ కు వచ్చి లొంగిపోయారని ప్రకాశ్‌నగర్‌ సీఐ ఆర్‌.సుబ్రహ్మణ్యేశ్వరరావు పేర్కొన్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని ’సాక్షి’కి తెలిపారు.

Advertisement
Advertisement