దోపిడీ గ్యాంగ్‌లు! | Robbery gangs | Sakshi
Sakshi News home page

దోపిడీ గ్యాంగ్‌లు!

Sep 3 2016 5:19 PM | Updated on Oct 8 2018 4:18 PM

దోపిడీ గ్యాంగ్‌లు! - Sakshi

దోపిడీ గ్యాంగ్‌లు!

కృష్ణా నదిలోని ఇసుకను అధికార పార్టీ నేతలు పంచుకుంటున్నారు. అధికారం చేపట్టి అమరావతిని రాజధానిగా ప్రకటించిన మొదలు ఇసుకపై కన్నేశారు.

* ఇసుకను పంచుకున్న అధికార పార్టీ పెద్దలు
గ్యాంగ్‌ల వారీగా తవ్వకాలు... అమ్మకాలు
రూ. వెయ్యి కోట్లకు పైగా దోచుకున్న తొలి బ్యాచ్‌
పుష్కరాల అనంతరం రంగంలోకి దిగిన రెండో బ్యాచ్‌
స్థానిక జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్‌లకు భాగస్వామ్యం
పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల సోదరుడి కనుసన్నల్లో అక్రమాలు
 
సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా నదిలోని ఇసుకను అధికార పార్టీ నేతలు పంచుకుంటున్నారు. అధికారం చేపట్టి అమరావతిని రాజధానిగా ప్రకటించిన మొదలు ఇసుకపై కన్నేశారు. మొదట ఇసుక దోపిడీని కొందరికే పరిమితం చేశారు. రెండేళ్లుగా మొదటి గ్యాంగ్‌ సుమారు రూ.వెయ్యి కోట్లకుపైగా సొమ్ముచేసుకుంది. అమరావతిలో ఇటీవల ఐదుగురు విద్యార్థులు పుష్కర స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు మరణించాక ఇసుక అక్రమ రవాణాకు నాలుగు రోజులు విరామం ఇచ్చారు. అప్పటి వరకు ఇసుకను అమ్మి సొమ్ముచేసుకున్న వారికి గడువు ముగిసిందని చెప్పేశారు. పుష్కరాల తరువాత మరో బ్యాచ్‌కు ఇసుక అమ్ముకునేందుకు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు అధికారపార్టీ పెద్దల ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. ఎమ్మెల్యే లేదా నియోజకవర్గ ఇన్‌చార్జి ఆధ్వర్యంలో ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. ఇందులో స్థానిక జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్‌లకు భాగస్వామ్యం ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందుకు లింగాయపాలెం ఇసుక రీచ్‌ నిదర్శన మని గ్రామస్తులు చెబుతున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర సోదరుడు సురేంద్ర ఆధ్వర్యంలో లింగాయపాలెం రీచ్‌ నుంచి ఇసుక అక్రమరవాణా సాగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇందులో రీచ్‌ పరిధిలోని సర్పంచ్, జెడ్పీటీసీ, మరికొందరు టీడీపీ నాయకుల భాగస్వామ్యం ఉందని స్పష్టం చేశారు.
 
అక్రమ దోపిడీపైనా నిఘా ... 
తుళ్లూరు మండలం లింగాయపాలెం, బోరుపాలెం ఇసుక రీచ్‌ల వద్ద వచ్చిపోయే లారీల వివరాలు.. వసూళ్లను సీసీ కెమెరా ద్వారా చిత్రీకరిస్తున్నారు. ప్రభుత్వం ఈ రెండు రీచ్‌లకు అనుమతి ఇవ్వలేదు. అయినా ఒక్కో రీచ్‌ నుంచి రోజూ వెయ్యికిపైగా లారీలు, టిప్పర్ల ద్వారా ఇసుక తరలిపోతోంది.  వచ్చిపోయే లారీలు, టిప్పర్ల నుంచి వసూళ్లు చేయటం కోసం ప్రత్యేకంగా రెండు టెంట్లు ఏర్పాటు చేశారు.  రీచ్‌లోకి  ప్రవేశించే లారీ డ్రైవర్‌ ముందు రూ.500 చెల్లించాలి. ఆ మొత్తం చెల్లిస్తేనే లారీని లోనికి అనుమతిస్తున్నారు. మిగిలిన రీచ్‌లలోనూ ఇదే తరహాలో దోపిడీ జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. 
 
అధికారిక లాంఛనాలతో అక్రమ రవాణా ..
తాత్కాలిక సచివాలయం పేరుచెప్పి అక్రమార్కులు ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. సచివాలయాన్ని నిర్మిస్తున్న కాంట్రాక్టర్‌ ఎల్‌అండ్‌టీ సంస్థకు చెందిన వాహనాలు పది ఉంటే... వందల సంఖ్యలో ప్రైవేటు వాహనాల ద్వారా అక్రమరవాణా సాగుతోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని నదీతీరం వెంట సుమారు 250కుపైగా అక్రమ ఇసుక క్వారీలు ఏర్పాటు చేసుకున్నారు. ఉండవల్లి, లింగాయపాలెం, తాళ్లాయపాలెం, బోరుపాలెంలోని ఒక్కో ఇసుక రీచ్‌ నుంచి రోజుకు సుమారు వెయ్యి టిప్పర్లు, లారీ ల ద్వారా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. మిగిలిన రీచ్‌ల నుంచి రోజుకు 300 నుంచి 500 లారీల ద్వారా ఇసుక రవాణా సాగుతోంది. ఈ అక్రమ రవాణా అధికారుల అండదండలతో  జరుగుతోంది. రెవెన్యూ, పోలీసు, మైనింగ్‌ అధికారుల కనుసన్నల్లో సాగుతున్న ఈ ఇసుక దోపిడీని ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించటం, బెదిరింపులకు దిగటం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement