
సాక్షి, హైదరాబాద్: ప్రజలే నేరుగా ఆన్లైన్లో ఇసుకను బుకింగ్ చేసుకునే విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ గవర్నెన్స్కు ఆన్లైన్ వేదికగా ఉన్న ‘మీ సేవ’ద్వారా ఇసుక బుకింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రజలకు సులభ రీతిలో పారదర్శకంగా, సమర్థవంతంగా ఇసుకను సరఫరా చేసే విధానాన్ని అందుబాటులోకి తెస్తోంది.
ఇసుక బుకింగ్ ప్రక్రియను డిజిటలైజేషన్ చేయడం వల్ల సరఫరాలో జాప్యం తగ్గుతుందని, అక్రమాలను నివారించవచ్చని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నూతన విధానంలో పౌరులు వాహనం రకం, ఇసుక పరిమాణం, ఏ స్టాక్యార్డ్ (ఇసుక రీచ్), దేనికి వినియోగిస్తారు, ఏ తేదీన కావాలి వంటి వివరాలను ఎంచుకోవచ్చు. ఆన్లైన్ చెల్లింపు ద్వారా బుకింగ్ పూర్తి చేసుకుని ఇసుకను ఎంచుకున్న చిరునామాకు డెలివరీ అయ్యేలా మీ సేవలో ఆప్షన్ ఇచ్చారు.
పౌరులు సమీపంలోని మీసేవ కేంద్రాన్ని సంప్రదిస్తే అక్కడ ఉండే వీఎల్ఈ సంబంధిత పౌరుడి మొబైల్ నంబరుతోపాటు ఇతర వివరాలను నమోదు చేస్తారు. తర్వాత ఇసుక డెలివరీ వివరాలు (జిల్లా, మండలం, గ్రామం లేదా సమీప కాలనీ, పిన్ కోడ్) అందించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆన్లైన్ చెల్లింపుతో బుకింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.