కౌన్సెలింగ్‌లో గందరగోళం | problems in NTR health university councelling for costodian certificate | Sakshi
Sakshi News home page

కౌన్సెలింగ్‌లో గందరగోళం

Sep 25 2015 10:14 PM | Updated on Sep 3 2017 9:58 AM

కౌన్సెలింగ్‌లో గందరగోళం

కౌన్సెలింగ్‌లో గందరగోళం

డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో శుక్రవారం ప్రారంభమైన రెండో, తుది విడత ఏపీ మెడికల్ కౌన్సెలింగ్‌లో కస్టోడియన్ సర్టిఫికెట్ల విషయమై కొద్దిసేపు గందరగోళం తలెత్తింది.

విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ) : డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో శుక్రవారం ప్రారంభమైన రెండో, తుది విడత ఏపీ మెడికల్ కౌన్సెలింగ్‌లో కస్టోడియన్ సర్టిఫికెట్ల విషయమై కొద్దిసేపు గందరగోళం తలెత్తింది. వివరాల్లోకి వెళితే ఈ ఏడాది ఏపీ, తెలంగాణకు సంబంధించి రెండు రాష్ట్రాలకు విడివిడిగా ఎంసెట్‌ పరీక్షలు నిర్వహించగా, డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీనే వేర్వేరుగా మెడికల్ కౌన్సెలింగ్‌లను నిర్వహించిన విషయం విదితమే. ఏపీ మెడికల్ కౌన్సెలింగ్‌లో భాగంగా తుది విడత కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఈ నెల 21న నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇటీవలే తెలంగాణ మెడికల్ కౌన్సెలింగ్ ప్రక్రియ ముగియగా, తుది విడత ఏపీ మెడికల్ కౌన్సెలింగ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో శుక్రవారం ప్రారంభమైంది. హెల్త్ వర్సిటీ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఏపీ ఎంసెట్‌లో అర్హత సాధించిన (తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన) అభ్యర్థులు ఎవరైనా ఒరిజినల్ సర్టిఫికెట్లతో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలి. అదే విధంగా మొదటి విడత ఏపీ మెడికల్ కౌన్సెలింగ్‌కు హాజరై... ప్రభుత్వ/ప్రైవేటు ఎ-కేటగిరీ (కన్వీనర్) సీట్లతో పాటు బి-కేటగిరీ (యాజమాన్య కోటా) సీట్లు పొందిన అభ్యర్థులు కూడా హెల్త్ యూనివర్సిటీ ఇచ్చిన అడ్మిషన్ పత్రంతో (కస్టోడియన్ సర్టిఫికెట్‌గా పరిగణిస్తూ) మాత్రమే కౌన్సెలింగ్‌కు హాజరుకావచ్చని హెల్త్ యూనివర్సిటీ జారీ చేసిన నోటిఫికేషన్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ఇటీవల ముగిసిన తుది విడత తెలంగాణ మెడికల్ కౌన్సెలింగ్‌లో అప్పటికే సీట్లు పొందిన కొంతమంది అభ్యర్థులు ఏపీ ఎంసెట్‌లో కూడా అర్హత సాధించి శుక్రవారం ప్రారంభమైన తుది విడత ఏపీ మెడికల్ కౌన్సెలింగ్‌కు నాన్-లోకల్ అన్ రిజర్వుడ్ కోటా కింద హాజరయ్యారు.

వీరితో పాటు వెటర్నరీ, ఏజీ బీఎస్సీ కోర్సుల్లో చేరిన ఏపీకి చెందిన అభ్యర్థులు కూడా వారివారి ఒరిజినల్ సర్టిఫికెట్లకు బదులు ఆయా కళాశాలల నుంచి కస్టోడియన్ సర్టిఫికెట్లతో కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. ఇలా హాజరైన అభ్యర్థులను కౌన్సెలింగ్ అధికారులు తిరస్కరించారు. దీంతో కొద్దిసేపు అభ్యర్థుల తల్లిదండ్రులు కౌన్సెలింగ్ అధికారులతో వాదనకు దిగగా నోటిఫికేషన్‌లో ఇచ్చిన కస్టోడియన్ సర్టిఫికెట్ అర్థాన్ని వివరించి చెప్పడంతో వారు నిరాశగా వెనుదిరిగారు. ఇటీవల ముగిసిన తుది విడత తెలంగాణ మెడికల్ కౌన్సెలింగ్‌లో కూడా ఇదే నిబంధనను అమలు చేశామని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఈ విధంగా సై ్లడింగ్ అవుతూపోతే ప్రైవేటు కళాశాలల్లోని మిగిలిపోయిన కన్వీనర్ కోటా (ఏ-కేటగిరీ) సీట్లు ఎన్‌ఆర్‌ఐ కోటాలో బదలాయింపునకు గురయ్యే ప్రమాదం ఉందని యూనివర్సిటీ వర్గాలు వివరించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement