మంచినీటి ఎద్దడి తలెత్తనీయొద్దు

మంచినీటి ఎద్దడి తలెత్తనీయొద్దు

– మున్సిపల్‌ పరిపాలన శాఖ డైరెక్టర్‌ కన్నబాబు 

 

కర్నూలు  (టౌన్‌): మంచినీటి ఎద్దడిని తలెత్తనీయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మున్సిపల్‌ పరిపాలన శాఖ డైరెక్టర్‌ కన్నబాబు ఆదేశించారు. శనివారం సాయంత్రం కర్నూలు నగరానికి వచ్చిన ఆయన ..స్థానిక ప్రభుత్వ ఆతిథి గృహంలో నగర పాలక సంస్థ అధికారులతో సమీక్ష  నిర్వహించారు. అలాగే నగరంలోని పాత బస్తీ ప్రాంతంలో పర్యటించారు. వీధుల్లో పారిశుద్ధ్యం మెరుగుపడలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు మార్సుకోవాలని మున్సిపల్‌ ఆరోగ్యశాఖ సిబ్బందిని హెచ్చరించారు.

 

అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇంజినీరింగ్, ఆరోగ్యశాఖ, రెవెన్యూ, టౌన్‌ ప్లానింగ్‌ విభాగాల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్నూలు ప్రజలకు మంచినీటి ఇక్కట్లు రాకుండా చూడాల్సిన బాధ్యత ఇంజినీరింగ్‌ విభాగంపై ఉందన్నారు. సుంకేసులలో, అలాగే సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంక్‌లోనూ నీరు అడుగంటిందన్నారు. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున ఆస్తి, నీటి పన్నులను వంద శాతం వసూలు చేయాలన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితా వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో నగరపాలక కమిషనర్‌ ఎస్‌. రవీంద్రబాబు, డిప్యూటీ కమిషనర్‌ రామలింగేశ్వర్, అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ శాస్త్రి షభ్నం, మున్సిపల్‌ ఇంజనీరు రాజశేఖర్‌, మేనేజర్‌ చిన్నరాముడు, నగరపాలక ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ కళ్యాణ చక్రవర్తి, రెవెన్యూ అధికారులు మల్లిఖార్జున, వీరస్వామి పాల్గొన్నారు. 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top