చి‘వరి’కి చుక్కెదురు! | no water supply kharif cultivation | Sakshi
Sakshi News home page

చి‘వరి’కి చుక్కెదురు!

Jun 15 2016 9:28 AM | Updated on Sep 4 2017 2:28 AM

చి‘వరి’కి చుక్కెదురు!

చి‘వరి’కి చుక్కెదురు!

జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టు నల్లవాగు కింది ఆయకట్టు రైతన్నలకు క ఁన్నీటి* కష్టాలు తప్పేట్టు లేదు.

నల్లవాగు ప్రాజెక్టు కాల్వలు, తూములు అధ్వానం
చివరి ఆయకట్టుకు నీటి సరఫరా ప్రశ్నార్థకం
ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్న రైతన్నలు

 కల్హేర్: జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టు నల్లవాగు కింది ఆయకట్టు రైతన్నలకు కన్నీటి కష్టాలు తప్పేట్టు లేదు. కాల్వలు శిథిలస్థితికి చేరినా పట్టించుకునేవారు కరువయ్యారు. ఫలితంగా ప్రాజెక్టు చివరి ఆయకట్టుకు సాగునీరు అందని ద్రాక్షగా మారుతోంది. తుంది. ప్రస్తుతం వర్షకాలం ప్రారంభం కావడంతో రైతులకు ఖరీఫ్ బెంగ పట్టుకుంది.

 ప్రాజెక్టుపై ఆశలు వదులుకున్న రైతులు బోర్ల ద్వారా సాగు చేసే పరిస్థితి నెలకొంది. గతంలో కాల్వల మరమ్మతుల పేరిట నిధులు ఖర్చు చేసిన అధికారులు, కాంట్రాక్టర్లు స్వలాభం చూసుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రూ.14 కోట్లతో ప్రాజెక్టు కాల్వల సీసీ లైనింగ్ చేపట్టినా నాణ్యత లేకపోవడంతో శిథిలమయ్యాయి. పోచాపూర్, బీబీపేట, మార్డి, కృష్ణపూర్, అంతర్గాం తదితర చోట్ల కాల్వలు ధ్వంసమయ్యాయి. ఫలితంగా చివరి ఆయకట్టు పరిధిలోని కల్హేర్, మార్డి, ఇందిరానగర్, కృష్ణపూర్ గ్రామాల వరకు సాగు నీరు అందని పరిస్థితి నెలకొంది. నల్లవాగు ప్రాజెక్టును పూర్తిగా ఆధునికరిస్తామని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు గతంలో హామీ ఇచ్చారు. వర్షకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఇక ఇప్పట్లో పనులు జరిగే అవకాశమే లేదు. 

 ప్రాజెక్టు నేపథ్యం
నల్లవాగు ప్రాజెక్టు 1965లో రూ.90 లక్షలతో నిర్మాణం జరిగింది. అప్పటి సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి శీలం సిద్దారెడ్డి ప్రారంభించారు. పూర్తిస్థాయి నీటిమట్టం 1,493 ఫీట్లు. ప్రాజెక్టు కూడి కాల్వ పరిధిలోని సుల్తానాబాద్, గోసాయిపల్లి, పోచాపూర్, బీబీపేట, ఖానాపూర్(కె), కృష్ణపూర్, మార్డి, ఇందిరానగర్, కల్హేర్‌లో 4,100 ఎకరాల వరకు ఆయకట్టు ఉంది. ప్రాజెక్టు ఎమర్జెన్సీ కెనాల్ కింద 60 ఎకరాలు ఆయకట్టు ఉంది. ఎడమ కాల్వ పరిధిలోని బొక్కస్‌గాం, అంతర్‌గాం, నిజామాబాద్ జిల్లా మార్దండ, తిమ్మనగర్ గ్రామాల్లో 1,230 ఎకరాల వరకు ఆయకట్టు ఉంది. ప్రాజెక్టు కాల్వలకు చెందిన తూములు, సైఫాన్లు దెబ్బతిన్నాయి. కట్టపై పలుచోట్ల పగుళ్లు ఏర్పడమే కాకుండా ప్రాజెక్టులో పూడిక నిండింది. పూడిక కోసం అధికారులు హైడ్రాలికల్ సర్వే చేపట్టినా పూడికతీత జరగకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement