రాష్ట్ర వ్యాప్తంగా ‘జన్మభూమి- మా ఊరు’లో 8.44 లక్షల మంది పేదలకు కొత్త రేషన్కార్డులు పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు.
కణేకల్లు : రాష్ట్ర వ్యాప్తంగా ‘జన్మభూమి- మా ఊరు’లో 8.44 లక్షల మంది పేదలకు కొత్త రేషన్కార్డులు పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. కణేకల్లు మండలం యర్రగుంటలో బుధవారం జరిగిన ‘జన్మభూమి- మా ఊరు’ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రేషన్కార్డు రాని వారు ప్రస్తుత ‘జన్మభూమి’లో అర్జీలు ఇస్తే మంజూరు చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటీ 35లక్షల మందికి చంద్రన్న సంక్రాంతి కానుకలిస్తున్నట్లు చెప్పారు. జూన్ నాటికి 24 లక్షల మందికి ‘దీపం’ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
డ్వాక్రా మహిళలకు పసుపు కుంకమ కింద ఒక్కో గ్రూపునకు రూ.30వేలు ఇస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా నేరుగా తమ సమస్యలు విన్నవించుకునేందుకు అర్జీలతో ఎదురుచూసిన ప్రజలకు నిరాశే ఎదురైంది. వచ్చిన వారికి అర్జీలు అధికారులకు ఇవ్వండంటూ మంత్రి వెళ్లిపోయారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి, రాయదుర్గం మార్కెట్ యార్డు చైర్మన్ చంద్రహాస్, వైస్ చైర్మన్ వన్నారెడ్డి, ఎంపీపీ షేక్ ఫాతిమాబీ, తహశీల్దార్ ఆర్.వెంకటేశు, ఎంపీడీఓ రెహనబేగం, సర్పంచుల సంఘం అధ్యక్షులు బసవరాజు, గుమ్మఘట్ట జెడ్పీటీసీ పూల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.