కూతురు మృతిని తట్టుకోలేక ఆగిన తల్లి గుండె | mother sudden death sees doughter death | Sakshi
Sakshi News home page

కూతురు మృతిని తట్టుకోలేక ఆగిన తల్లి గుండె

Sep 11 2017 7:01 AM | Updated on Nov 6 2018 8:08 PM

మృతి చెందిన రోజా, కూతురి మృతదేహాన్ని చూసేందుకు వచ్చి మృతి చెందిన కుప్పమ్మ - Sakshi

మృతి చెందిన రోజా, కూతురి మృతదేహాన్ని చూసేందుకు వచ్చి మృతి చెందిన కుప్పమ్మ

మండలంలోని అన్నూ రు పంచాయతీ శెట్టిగుంట ఎస్టీ కాలనీలో శనివారం అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతిచెందింది.

కూతురు మృతిపై పలు అనుమానాలు
కార్వేటినగరం : మండలంలోని అన్నూరు పంచాయతీ శెట్టిగుంట ఎస్టీ కాలనీలో శనివారం అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతిచెందింది. కూతురి మరణాన్ని చూసి తట్టుకోలేక తల్లి కుప్పకూలింది. తల్లీ కూతురు ఒకేసారి తనువు చాలించడంతో శెట్టిగుంట ఎస్టీ కాలనీలో విషాదం అలుముకుంది. ఎస్‌ఐ కథనం మేరకు.. మండలంలోని శెట్టిగుంట ఎస్టీకాలనీకి చెందిన పి. శ్రీనివాసులు భార్య పి.రోజా(24) స్థానిక అంగన్‌వాడి కేంద్రంలో ఆయాగా పనిచేస్తోంది. శ్రీనివాసులు శనివారం రాత్రి కూలి పనుల నుంచి వచ్చాడు. ఈ క్రమంలో భార్య స్పృహతప్పి పడి ఉండడాన్ని గుర్తించి ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో ఆమె మృతి చెందింది.

ఇదిలా ఉండగా రోజా ప్రతి రోజూ అంగ్‌వాడీ కేంద్రానికి పిల్లలను తీసుకెళ్లి వస్తుండేది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన బాలాజీ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం నెలకొన్న ట్టు కాలనీలో పుకార్లు వచ్చాయి. దీంతో బాలాజీ భార్య ద్రాక్షాయణి శనివారం రాత్రి బంధువులతో కలిసి రోజాపై దాడి చేసింది. దీన్ని అవమానంగా భావించిన రోజా ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. రోజా ను చితకబాదడంతోనే మృతి చెందిన ట్లు పలువురు ఆరోపిస్తున్నారని ఎస్‌ఐ తెలిపారు.  

శెట్టిగుంట ఎస్టీ కాలనీలో విషాదం
కూతురు రోజాపై దాడి చేసినట్టు శ్రీరంగరాజపురం మండలంలోని పిళ్లారికుప్పం ఎస్టీకాలనీలో ఉన్న రోజా తల్లి కుప్పమ్మకు తెలిసింది. ఆమె వెంటనే శెట్టిగుంటకు వచ్చింది. చనిపోయిన రోజాను చూసి రోదిస్తూ స్పృహతప్పి పడిపోయింది. స్థానికులు ఆమెను చికిత్సకోసం తిరుపతికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. ఈ ఘటనతో ఎస్టీ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement