ఇంటి వద్దకే ‘మధ్యాహ్న’ సరుకులు | mid day materials at homes | Sakshi
Sakshi News home page

ఇంటి వద్దకే ‘మధ్యాహ్న’ సరుకులు

May 2 2017 11:48 PM | Updated on Aug 29 2018 7:54 PM

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం వేసవిలోనూ అమలు కానుంది.

అనంతపురం అర్బన్‌ : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం వేసవిలోనూ అమలు కానుంది. అయితే.. భోజనానికి బదులు రేషన్‌ సరుకులు అందించనున్నారు. చౌక డిపో డీలర్లు నేరుగా విద్యార్థుల ఇళ్లవద్దకు వెళ్లి సరుకులు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్‌చార్జ్‌ జాయింట్‌ కలెక్టర్‌ సయ్యద్‌ ఖాజామొహిద్దీన్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో పౌర సరఫరాల సంస్థ, విద్యా శాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. మధ్యాహ్న భోజన పథకం కింద పంపిణీ చేసేందుకు బియ్యం, కందిపప్పు స్టాక్‌ ఎంత వచ్చిందని పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ శివశంకర్‌రెడ్డిని అడిగారు.

1,257 టన్నుల బియ్యం, 250 టన్నుల కందిపప్పు వచ్చిందని ఆయన తెలిపారు.  ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రాథమిక పాఠశాల విద్యార్థికి నాలుగు కిలోల బియ్యం,  నెలకు సరిపడా కందిపప్పు (రోజుకు 20 గ్రాముల చొప్పున), 200 మి.లీ. పామాయిల్‌ ఇవ్వాలని ఇన్‌చార్జ్‌ జేసీ ఆదేశించారు. ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు ఆరు కిలోల బియ్యం, రోజుకు 30 గ్రాముల చొప్పున కందిపప్పు (నెల కోటా), 300 మి.లీ. పామాయిల్‌ ఇవ్వాలన్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యార్థులకు నెలకు 15 కోడిగుడ్లు అందజేయాలన్నారు. బియ్యం, కందిపప్పును ఈ నెల నాల్గో తేదీలోగా చౌక డిపోలకు సరఫరా చేయాలని, ఐదో తేదీ నుంచి విద్యార్థులకు డీలర్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి టి.శివరాంప్రసాద్, డీఈఓ పగడాల లక్ష్మీనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement