మద్యం మత్తులో బావిలో పడి వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో బావిలో పడి వ్యక్తి మృతి

Published Fri, Aug 26 2016 12:37 AM

మద్యం మత్తులో బావిలో పడి వ్యక్తి మృతి

 
కోవూరు : మద్యం మత్తులో బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికుల కథనం మేరకు.. కోవూరు బుద్ధివారి వీధిలో  నివాసం ఉంటున్న వంగపాటి మహేష్‌ (35) బార్బర్‌ షాపుల్లో పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మహేష్‌ కొద్ది రోజులుగా మద్యానికి బాసిసయ్యాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఒక్కోసారి మద్యం తాగి రెండు..మూడు రోజులు కూడా ఇంటికి వచ్చేవాడు కాదు. ఈ క్రమంలో బుద్ధివారి సమీపంలో ఉన్న బావిలో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు బావిలో పరిశీలించగా మృతదేహం నీటిపై తేలాడుతుండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ వెంకట్రావు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహం వంగపాటి మహేష్‌గా గుర్తించారు. మృతదేహం బాగా ఉబ్బి దుర్గంధం వెదజల్లుతుంది. మృతుడు రెండు రోజులుగా ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.దీన్ని బట్టి మద్యం మత్తులో బావి మీద కూర్చోని అందులో పడి మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు ఎస్‌ఐ వెంకట్రావు తెలిపారు.   

 

Advertisement
Advertisement