అక్షయ పాత్ర..అరుదైన విగ్రహాలు.. | life imprisonment for robbery gang | Sakshi
Sakshi News home page

అక్షయ పాత్ర..అరుదైన విగ్రహాలు..

Jul 26 2016 7:18 PM | Updated on Sep 4 2017 6:24 AM

అక్షయ పాత్ర పేరుతో చోరీలకు పాల్పడుతున్న ముఠాకు జీవిత ఖైదు విదిస్తూ.. రెండో అదనపు జిల్లా న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.

తమ వద్ద అరుదైన విగ్రహాలు, అక్షయ పాత్ర ఉన్నాయంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారులను బోల్తా కొట్టించి లక్షలాది రూపాయలు దోచుకెళ్లిన  జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2009లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలివీ... కె.శ్రీధర్, సత్యజిత్ రాజేష్, శ్రీనివాస్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్, తనుజిత్‌కుమార్, ఎస్.పోతురాజు, రామలింగ ప్రసాద్ అనే వారు ముఠాగా ఏర్పడి అరుదైన విగ్రహాలు ఉన్నాయంటూ ధనవంతులకు గాలం వేసేందుకు యత్నిస్తున్నారు.

 

తమ వద్ద ఉన్న అక్షయ పాత్రతో ధనం రెట్టింపవుతుందని నమ్మబలికేవారు. వీరి మాటలకు ఆకర్షితులైన వరంగల్ జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపారి జ్యోతికుమార్, కేరళకు చెందిన కేబీ.బహులేయం, కోయంబత్తూర్‌కు చెందిన ఆర్. శివం తదితరులు వీరిని సంప్రదించారు. 2009 మే 10 వ తేదీన వీరందరినీ హైదరాబాద్‌కు ర ప్పించిన ముఠా సభ్యులు.. అందరినీ వెంకటగిరిలోని ఓ గదికి తీసుకెళ్లారు. అక్కడ వీరిని బంధించి రూ.5.50 లక్షల నగదుతో పాటు ఆభరణాలను దోచుకుని పరారయ్యారు.

 

బాధితులు అదే రోజు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదుచేయగా 2009 జూలై 1వ తేదీన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరు చోరీకి పాల్పడ్డ వివరాలు, బంధించి నగదు, ఆభరణాలు తస్కరించిన ఆధారాలను జూబ్లీహిల్స్ పోలీసులు కోర్టుకు పక్కాగా సమర్పించారు. ఈ మేరకు వీరిపై నేరం రుజువుకావటంతో మంగళవారం రెండో అదనపు జిల్లా న్యాయమూర్తి వీరందరికీ జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement