
వైఎస్ఆర్సీపీ ప్లీనరీకి తరలిన నాయకులు
గుంటూరులో శని, ఆదివారాల్లో జరిగే వైఎస్ఆర్సీపీ మూడో జాతీయ ప్లీనరీకి జిల్లా నుంచి పార్టీ నాయకులు,
కర్నూలు(కొండారెడ్డిఫోర్టు): గుంటూరులో శని, ఆదివారాల్లో జరిగే వైఎస్ఆర్సీపీ మూడో జాతీయ ప్లీనరీకి జిల్లా నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు భారీ స్థాయిలో తరలి వెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి 12 గంటల వరకు వెళ్లారు. ప్రతి నియోజవకర్గం నుంచి ప్రత్యేక బస్సులు, కార్లు, జీపులు, ఇతర వాహనాలను నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసుకొని శనివారం ఉదయం ప్లీనరీ ప్రాంగణంలో ఉండేవిధంగా ప్రణాళికలు తయారు చేసుకొని వెళ్లిపోయారు. కర్నూలు నుంచి గంటూరుకు దాదాపు 8 గంటల ప్రయాణ సమయం.
పత్తికొండ నియోజవకర్గ ఇన్చార్జ్ కంగాటి శ్రీదేవి ఆధ్వర్యంలో 20 వాహనాల్లో నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. వీరు మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలోనే కదిలివెళ్లారు. బనగానపల్లె నియోజకవర్గ ఇన్చార్జ్ కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో 25 వాహనాల భారీ కాన్వాయ్లో తరలి వెళ్లారు. కర్నూలు నియోజవకర్గ ఇన్చార్జ్ హఫీజ్ఖాన్ ఆధ్వర్యంలో ఒక బస్సు, 20 వాహనాల్లో కార్యకర్తలు, నాయకులు వెళ్లారు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య ఆధ్వర్యంలోని నాయకులు, కార్యకర్తలు శనివారం ఉదయం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంత్యుత్సవంలో పాల్గొని వెళ్లేందుకు ప్రణాళికలు తయారు చేసుకున్నారు. ఆదోని, మంత్రాలయం ఎమ్మెల్యేలు సాయిప్రసాద్రెడ్డి, బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ నుంచి వెళ్లారు. ఆలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి ఒక్కో మండలం నుంచి మూడు వాహనాల్లో గుంతకల్ నుంచి బయలు దేరారు.
ఎమ్మిగనూరు, కోడుమూరు, ఆత్మకూరు నియోజకవర్గాల ఇన్చార్జ్లు జగన్మోహన్రెడ్డి, మురళీకృష్ణ, బుడ్డా శేషారెడ్డి ఆధ్వర్యంలో భారీ కాన్వాయ్ గుంటూరుకు బయలు దేరింది. నంద్యాలలో ఇన్చార్జ్ శిల్పా మోహన్రెడ్డి, సీఈసీ మెంబర్ రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 100 వాహనాల్లో అమరావతికి ప్రయాణమయ్యారు. ఆళ్లగడ్డలో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డి ఆధ్వర్యంలో 50 వాహనాల శ్రేణి బయలు దేరింది. డోన్ నుంచి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ఆధ్వర్యంలో, పాణ్యంలో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ప్లీనరీకి తరలివెళ్లారు.