రాగాల ప‌ల్ల‌కిలో.. | international music day special | Sakshi
Sakshi News home page

రాగాల ప‌ల్ల‌కిలో..

Jun 20 2017 10:30 PM | Updated on Sep 5 2017 2:04 PM

రాగాల ప‌ల్ల‌కిలో..

రాగాల ప‌ల్ల‌కిలో..

అరవై ఏళ్లకు పైగా ఆయన పాడుతూనే ఉన్నాడు. ఆ పాటకు నేటికీ విరామం లేదు. సప్తతి దాటిన జిత్‌మోహన్‌ మిత్రా విద్యార్థి దశ నుంచి పాటలు

పనీ–పాటా అన్నారు. దైనందిన జీవితం సక్రమంగా నడవడానికి పని ఎంత ముఖ్యమో, ఒత్తిడి నుంచి సేదతీరడానికి పాట కూడా అంతే ముఖ్యం. కావేరీ జలాలు సేవిస్తే సంగీతం, గోదావరి జలాలు సేవిస్తే సాహిత్యం అబ్బుతాయన్నది నిన్నటి మాట. గోదావరి కెరటాలతో సంగీతం కూడా వినిపిస్తుందని చాటిచెప్పే సంస్థలు ఇప్పుడు కన్ను తెరుచుకుంటున్నాయి. ఔత్సాహిక గాయకులకు తమ ప్రతిభను వ్యక్తం చేయడానికి నెలనెలా కార్యక్రమాలు నిర్వహించే సంస్థలకు నేడు లోటు లేదు. నేడు అంతర్జాతీయ సంగీత దినోత్సవం సందర్భంగా 
ఇటువంటి సంస్థలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. 
- రాజమహేంద్రవరం కల్చరల్‌
ఆయన పాటకు షష్టిపూర్తి దాటింది.
అరవై ఏళ్లకు పైగా ఆయన పాడుతూనే ఉన్నాడు. ఆ పాటకు నేటికీ విరామం లేదు. సప్తతి దాటిన జిత్‌మోహన్‌ మిత్రా విద్యార్థి దశ నుంచి పాటలు సాధన చేశారు. నటుడిగా మారి సినిమాల్లో డబుల్‌ సెంచరీ దాటినా, పాటే ఆయన తొలి ప్రాధాన్యమైంది. జిత్‌ మోహన్‌ మిత్రా ఆర్కెస్ట్రా స్థాపించి, ఏటా సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలుగు, హిందీ పాటలు రెంటినీ ఆయన గళం వినిపిస్తూనే ఉంది.
సంప్రదాయ సంగీతానికి పెన్నిధి శ్రీసద్గురు సన్నిధి.
‘శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః...’ అన్నారు పెద్దలు. శిశువులు, పశువులేకాదు, విష సర్పాలు సైతం సంగీతానికి వశులవుతాయి. సంగీతంలో డిప్లమో చేసిన శిష్టు మధుసూదనరావు యువతలో అంతర్లీనంగా ప్రతిభ ఉన్న కళాకారులు తగిన వేదిక అందుబాటులో లేకపోవడం వల్ల గుర్తింపు పొందలేకపోతున్నారని గ్రహించారు. 2012లో యువసంగీత కళాకారులను ప్రోత్సహించడానికి శ్రీసద్గురు సన్నిధి స్థాపించారు. ప్రతినెలా రెండో ఆదివారం గోదావరి గట్టున ఉన్న త్యాగరాజ నారాయణదాస సేవాసమితి ఆవరణలో లబ్ధప్రతిష్ఠులైన గాయకులతోపాటు, కొత్తవారికీ సంస్థ నిర్వహించే శాస్త్రీయ సంగీత కార్యక్రమాల్లో అవకాశం కల్పిస్తున్నారు.
రాయుడు ఆర్కెస్ట్రా..
రాయుడు చంద్రకుమార్‌ ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. సంగీతమన్నా, అమరగాయకుడు ఘంటసాల పాటలన్నా ఆయనకు అమితప్రేమ. గోదావరి గట్టుపై ఘంటసాల విగ్రహ వ్యవస్థాపకుడు రాయుడు చంద్రకుమార్‌. ఔత్సాహిక గాయకులను ప్రోత్సహించడానికి రాయుడు ఆర్కెస్ట్రా స్థాపించి, ఏటా అనేక వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎందరో డాక్టర్లు రాయుడు ఆర్కెస్ట్రా వేదికపై సింగర్లయ్యారు. 40మంది గాయకులతో ఒకే వేదికపై 40 ఘంటసాల పాటలను, 40 గీతాశ్లోకాలను ఆలపించిన సంఘటన తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో నమోదైంది.
యువతకు శిక్షణనిస్తూ..
కేంద్రప్రభుత్వ సంస్థలో పని చేస్తున్న ఉడతా జయలక్ష్మికి చిన్నతనం నుంచి సంగీతం ఆరో ప్రాణం. ఇంటివద్దనే కర్ణాటక సంగీతం నేర్చుకున్న జయలక్ష్మి ఆసక్తి ఉన్న కళాకారులకు శిక్షణ ఇస్తున్నారు. సంగీత కార్యక్రమాలు నిర్వహించేవారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. మెలోడీ ప్రధానంగా ఉన్న మంచి సంగీతానికి ప్రాధాన్యం లభించాలని ఆమె కోరుకుంటున్నారు.
సంగీతలహరి
నెలనెలా సంగీత కార్యక్రమాలు నిర్వహించే సంగీతలహరి సంస్థ దానవాయిపేట పాండురంగస్వామి ఆలయంలో ఔత్సాహిక గాయనీగాయకులకు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశాలు కలగచేస్తోంది. ప్రముఖ మృదంగ విద్వాంసుడు వరదా కమలాకరరావు తనయుడు యోగీష్‌ సంస్థకు పూర్వ అధ్యక్షుడు. ఏటా త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న సంస్థ ఇది.
డాక్టర్‌ మంగళంపల్లి బాలమురళీకృష్ణ సంగీత సభ
మంగళంపల్లి బాలమురళికి వీరాభిమాని సాగి శ్రీరామచంద్రమూర్తి ఏటా బాలమురళి పుట్టినరోజున నగరంలో సంగీత కార్యక్రమాలను నిర్వహించి, ప్రముఖ సంగీత విద్వాంసులను ఘనంగా సత్కరించేవారు. బాలమురళీకృష్ణ సంగీతసభను ఆయన స్థాపించారు. తొలిసారిగా ఈ ఏడాది బాలమురళీకృష్ణ ‘జయంతిని’ జులై ఆరో తేదీన నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
శ్రీత్యాగరాజ నారాయణదాస సేవాసమితి
1952లో బుగ్గా పాపయ్యశాస్త్రి స్థాపించిన త్యాగరాజ నారాయణ దాస సేవాసమితి ప్రస్తుతం గోదావరి గట్టున ఉంది. ఏటా సమితి నిర్వాహకులు దక్షిణాది అగ్రసంగీత కళాకారులను ఆహ్వానించి, నేటి వరకు క్రమం తప్పకుండా సంగీత కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement