రోడ్డు ఆక్రమణపై విచారణ
నెల్లూరు రూరల్: నడి రోడ్డును ఆక్రమించి ఇళ్లను నిర్మించారనే విషయమై కోర్టు ఆదేశాల మేరకు తహశీల్దార్ వెంకటేశ్వర్లు శుక్రవారం ఉద్రిక్తతల నడుమ పొదలకూరు రోడ్డు ఇందిరాగాంధీ నగర్లో విచారణ జరిపారు.
నెల్లూరు రూరల్: నడి రోడ్డును ఆక్రమించి ఇళ్లను నిర్మించారనే విషయమై కోర్టు ఆదేశాల మేరకు తహశీల్దార్ వెంకటేశ్వర్లు శుక్రవారం ఉద్రిక్తతల నడుమ పొదలకూరు రోడ్డు ఇందిరాగాంధీ నగర్లో విచారణ జరిపారు. వివరాలు.. శ్రీలంక శరణార్థుల కోసం గతంలో ఇందిరాగాంధీనగర్లో ప్రభుత్వం పట్టాలను మంజూరు చేసింది. అయితే అక్కడ ముత్తుమరియమ్మ గుడిని ఆనుకొని ఉన్న రోడ్లను సైతం ఆక్రమించి రాత్రికి రాత్రే శరవణ గోపీ, వరలక్ష్మి, గణేష్, భువనేశ్వరి ఇళ్లు నిర్మించారు. అధికార పార్టీ అండదండలతో పట్టాలను సైతం తీసుకున్నారు. ఇళ్లు నిర్మించేటప్పుడు కార్పొరేషన్ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ఈ విషయమై స్థానికులు నగర పాలక సంస్థకు, లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. నిర్మాణాల విషయమై కార్పొరేషన్ అధికారులకు లోకాయుక్త తాఖీదు పంపింది. అయినా నిర్మాణాలను పూర్తి చేయడంతో స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో తహశీల్దార్ వెంకటేశ్వర్లు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఘర్షణలు జరగకుండా నిలువరించారు. స్థానికులు, ఇళ్ల నిర్మాణదారుల అభిప్రాయాలను తహశీల్దార్ తెలుసుకున్నారు. గతంలో ఇక్కడ పది మందికి పట్టాలిచ్చామని, ఇక్కడి పరిస్థితుల దష్ట్యా వీటిని రద్దు చేశామని చెప్పారు. నివేదికను కోర్టుకు పంపుతామని వెల్లడించారు. అడిషనల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ పెంచలరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.