పరారే...పరారీ ! | Escape ... escape! | Sakshi
Sakshi News home page

పరారే...పరారీ !

Feb 5 2017 11:58 PM | Updated on Sep 5 2017 2:58 AM

కడప కేంద్ర కారాగారం నుంచి 2014 డిసెంబరు 28వ తేదీన నలుగురు జీవిత ఖైదీలు పరారయ్యారు. తాజాగా కడప కేంద్ర కారాగారం పెట్రోలు బంకులో ఓపెన్‌ ఎయిర్‌ జైలు విధానంలో పనిచేస్తున్న జీవిత ఖైదీ ఎన్‌.యల్లప్ప కూడా రూ. 10 వేలు డబ్బులతో జైలు అధికారులు, సిబ్బంది కళ్లుగప్పి పరారయ్యాడు.

కడప అర్బన్‌ : కడప కేంద్ర కారాగారం నుంచి 2014 డిసెంబరు 28వ తేదీన నలుగురు జీవిత ఖైదీలు పరారయ్యారు. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆ సంఘటన సంచలనం సృష్టించింది. నలుగురు జీవిత ఖైదీలు పరారైన సమయంలో కేంద్ర కారాగార సూపరింటెండెంట్‌ గోవిందరాజులను బలవంతంగా సెలవుపై పంపించారు. ఒక డిప్యూటీ సూపరింటెండెంట్‌ను, ఇద్దరు జైలర్లను, ఇద్దరు హెడ్‌ వార్డర్‌లను కలిపి మొత్తం ఆరుగురిని సస్పెండ్‌ చేశారు. ఆ సంఘటనలో ఏడాదిపాటు గాలింపు చర్యలు చేపడితే పరారైన వారిలో కేవలం ముగ్గురు మాత్రమే రామచంద్ర, రవికుమార్, దేవలు పట్టుబడ్డారు. మరో ఖైదీ హనుమంతు ఇంకా పోలీసులకు చిక్కలేదు. తాజాగా కడప కేంద్ర కారాగారం పెట్రోలు బంకులో ఓపెన్‌ ఎయిర్‌ జైలు విధానంలో పనిచేస్తున్న జీవిత ఖైదీ ఎన్‌.యల్లప్ప కూడా రూ. 10 వేలు డబ్బులతో జైలు అధికారులు, సిబ్బంది కళ్లుగప్పి పరారయ్యాడు. ఈ సంఘటనలో ఎవరిపైన చర్యలు తీసుకుంటారోనని జైలు శాఖ సిబ్బంది బిక్కుబిక్కుమంటున్నారు. మరోవైపు పరారైన జీవిత ఖైదీ యల్లప్ప కోసం ఇప్పటికే ఒకవైపు జైలు అధికారులు, సిబ్బంది, పోలీసులు వేట ప్రారంభించినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement