
సమయం లేదు మిత్రమా!
ఇప్పటివరకు వార్షిక పరీక్షల హడావుడిలో మునిగిపోయిన విద్యార్థులు ఇప్పుడు సెట్ల కోసం సిద్ధమవుతున్నారు.
⇒వరుసగా వచ్చేస్తున్న ‘సెట్’లు
⇒పది నుంచి డిగ్రీ వరకు సెట్లకు సిద్ధమవుతున్న విద్యార్థులు
⇒ ఏప్రిల్, మే నెలల్లోనే అధిక ప్రవేశ పరీక్షలు
⇒ఆన్లైన్ పరీక్షలకు ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం
ఇప్పటివరకు వార్షిక పరీక్షల హడావుడిలో మునిగిపోయిన విద్యార్థులు ఇప్పుడు సెట్ల కోసం సిద్ధమవుతున్నారు. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు అంతా వివిధ రకాల ప్రవేశ పరీక్షల కోసం రేయింబవళ్లు కష్టపడుతున్నారు. ఏప్రిల్, మే నెలల్లోనే పరీక్షలు ఉండడంతో ఉన్న ఈ కొద్ది కాలాన్ని పూర్తిగా వినియోగించుకునేందుకు విద్యార్థులు శ్రమిస్తున్నారు. ఎంసెట్, పాలిసెట్, లాసెట్, ఎడ్ సెట్, ఈసెట్, ఐసెట్, పీజీ సెట్, ఆసెట్ ఇలా అన్ని సెట్లకు జిల్లా విద్యార్థులు సంసిద్ధులుగానే ఉన్నారు. కొందరు విద్యార్థులు కోచింగ్లు తీసుకుంటూ చదువుతుండగా, మరికొందరు సొంతంగానే ప్రిపేరవుతున్నారు. – ఏయూక్యాంపస్
పాలిసెట్ ( ఏప్రిల్ 28 )
పదో తరగతి తర్వాత విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సులో చేరేందుకు ప్రవేశం కోసం నిర్వహించే పరీక్ష. మూడేళ్ల డిప్లమా అనంతరం విద్యార్థులకు మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత కూడా ఇంజినీరింగ్ రెండో ఏడాదిలో నేరుగా చేరే అవకాశం లభిస్తుంది. జిల్లాలో ఆరు ప్రభుత్వ, 26 ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలు ఉన్నాయి. కంచ రపాలెం, అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు, భీమి లి(బాలికలు), కంచరపాలెంలో కెమికల్ ఇంజినీరింగ్ కాలేజీ ఉంది. పేద, మధ్య తరగతి విద్యార్థులు ఎక్కువగా పాలిటెక్నిక్ విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
లాసెట్ (ఏప్రిల్ 19)
డిగ్రీ, ఇంటర్మీయెట్ తర్వాత న్యాయ శాఖవైపు ఆసక్తి ఉన్నవారు లా సెట్కు సిద్ధమవుతున్నారు. డిగ్రీ తర్వాత మూడేళ్ల లా, ఇంటర్మీడియెట్ తర్వాత ఐదేళ్ల లా, ఎల్ఎల్బీ తర్వాత పీజీ కోర్సు ఎల్ఎల్ఎంల్లో చేరేందుకు లా సెట్ రాయాలి. ప్రస్తుతం సీట్లు సైతం సులభంగా దొరుకుతున్నాయి. న్యాయవాదిగా స్థిరపడాలన్నా, న్యాయాధికారులుగా స్థిర పడాలన్నా ఈ సెట్ అవసరం. విద్యార్థులు శ్రమించి చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. జిల్లా నుంచి వందల సంఖ్యలో అభ్యర్థులు లాసెట్ రాస్తుండగా, రెండు కళాశాలలు సైతం స్థానికంగా ఉన్నాయి.
ఎంసెట్ (ఏప్రిల్ 24 నుంచి 27 వరకు)
ప్రస్తుతం అందరి దృష్టి ఎంసెట్పైనే. నచ్చిన కళాశాల, బ్రాంచ్ల్లో సీట్లు రావాలంటే విద్యార్థులు శ్రమించి చదవాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్లు లభిస్తే మంచి భవిష్యత్ సొంతమవుతుంది. జిల్లా నుంచి వేల సంఖ్యలో విద్యార్థులు ఎంసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్కు సిద్ధమవుతున్నారు.
ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ (ఏప్రిల్ 28)
ప్రస్తుతం బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులు మెడిసిన్ సీటు కోసం జాతీయ స్థాయిలో నీట్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అయితే అగ్రికల్చర్ బీఎస్సీ, ఫార్మసీ ప్రవేశాలకు ప్రత్యేకంగా ఎంసెట్ రాయాల్సి ఉంటుంది. బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులు ఈ సెట్కు సిద్ధం అవుతున్నారు.
ఎడ్సెట్ (ఏప్రిల్ 19)
డిగ్రీ తర్వాత ఉపాధ్యాయ వృత్తిపై ఆసక్తి ఉన్న విద్యార్థులు ఎడ్సెట్ రాస్తున్నారు. అయితే గతంతో పోల్చితే ఈ సారి చాలా తక్కువ మందే పోటీ పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 508 బీఎడ్ కళాశాలు ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. బీఎడ్ తర్వాత ఎంఎడ్ చదివే అవకాశం ఉంది. ఎడ్ సెట్కు 8,200 దరఖాస్తులు వచ్చాయి.
ఈ సెట్ (మే 3)
ఈ సెట్ రాయడం ద్వారా పాలిటెక్నిక్ కోర్సు తర్వాత విద్యార్థులు నేరుగా ఇంజినీరింగ్ రెండో ఏడాదిలో చేరే వీలుంటుంది. ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో 20 శాతం సీట్లు పాలిటెక్నిక్ విద్యార్థులకు రిజర్వు చేసి ఉంటాయి. పాలిటెక్నిక్ తర్వాత ఇంజినీరింగ్ చదవటం వల్ల మరింత నైపుణ్యం సంపాదించవచ్చు.
ఐసెట్ (మే 2)
డిగ్రీ తర్వాత విద్యార్థులు ప్రస్తుతం ఐసెట్కు ప్రాధాన్యత నిస్తున్నారు. ఐసెట్ ద్వారా ఎంబీఏ, ఎంసీఏల్లో ప్రవేశాలు దొరుకుతాయి. విద్యార్థులు శ్రమించి చదివితే బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో మంచి ఉపాధి అవకాశాలున్నాయి.
పీజీ ఈ సెట్ (మే 10, 11)
బీటెక్ విద్యార్థులు ఎంటెక్లో చేరేందుకు పీజీ ఇంజినీరింగ్ సెట్ పరీక్షకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పీజీ ఈ–సెట్కు 32వేల అప్లికేషన్లు వచ్చాయి. జిల్లావ్యాప్తంగా విద్యార్థులు శ్రమించి చదువుతున్నారు.
ఏపీ సెట్ (జూలై 30 )
పీజీ అనంతరం విద్యార్థులు ప్రాధాన్యం ఇచ్చే మరో కోర్సు ఏపీ సెట్. దీనిని ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది. దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరుతేదీ మే 10. రాష్ట్రవ్యాప్తంగా 50వేలకు పైగా దరఖాస్తులు రావచ్చని అంచ నా వేస్తున్నారు. నెట్, స్లెట్ వంటి పరీక్షలకు సిద్ధం కావడానికి, మరో పక్క ఎంఫిల్, డాక్టరేట్ చదివేం దుకు అవకాశం ఉంటుంది. బోధన రంగంలో ఆసక్తి ఉన్న వారు ఎక్కువగా ఈ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్నారు.
ఆసెట్ (మే 6 నుంచి 8)
ప్రస్తుతం డిగ్రీ చివరి ఏడాది పరీక్ష రాసిన విద్యార్థులు ఎక్కువగా ఆ సెట్కు సిద్ధమవుతున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ, డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయాల్లో పీజీ ప్రవేశాలు పొందవచ్చు. 6000 సీట్ల భర్తీ కోసం నిర్వహించే ఆసెట్కు 19వేల అప్లికేషన్లు వచ్చాయి. పీజీ విద్య విద్యార్థులకు రెండు విధాలుగా ఉపయోగ పడుతుంది. పీజీ అనంతరం ఎంఫిల్, పీహెచ్డీ, నెట్, స్లెట్ వంటివి పూర్తి చేసి బోధన రంగంలో స్థిరపడటం, పీజీ చదువుతూ పోటీ పరీక్షలకు సిద్ధమై ఉద్యోగ, ఉపాధి రంగాలు అంది పుచ్చుకోవటం ద్వారా రెండు విధాలుగా ఈ విద్య దోహద పడుతుంది.
అభిరుచికి అనుగుణంగా
విద్యార్థులు తమ అభిరుచికి అనుగుణంగా కోర్సులను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు ఇష్టపడి చదివితే మెరుగైన ఫలితాలను సాధించగలరు. ప్రణాళికా బద్ధంగా సమయనిర్వహణ చేసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు తమ సామర్థ్యాలకు అనుగుణంగా కోర్సులను ఎంపిక చేసుకోవడం ఎంతో మంచిది. నాలుగేళ్ల విద్య, తన జీవితాన్ని తీర్చిదిద్దుతుదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. – ఆచార్య వై.సత్యనారాయణ, అంబేడ్కర్ న్యాయ కళాశాల, ఏయూ
లక్ష్యంతో సాగాలి
విద్యార్థులు చేసే ప్రతీ ప్రయత్నం లక్ష్యనిర్దేశంగా సాగాలి. తన ఆసక్తి, శక్తికి అనువైన రంగాన్ని ఎంపిక చేసుకోవడం ఎంతో మంచిది. విశ్వవిద్యాలయాలు, ప్రముఖ సంస్థల్లో స్థానం సాధించాలంటే ఎంతో కష్టించాల్సిన అవసరం ఉంటుంది. ముందుగా తాను సిద్ధమవుతున్న పరీక్ష విధానం, ప్రశ్నలు అడిగే అంశాలు వంటివి పూర్తిగా తెలుసుకోవాలి. తదనుగుణంగా పరీక్షకు సన్నద్ధమైతే సునాయాసంగా లక్ష్యాన్ని చేరుకోగలరు. – ఆచార్య పి.విశ్వనాథం, వాణిజ్య నిర్వహణ æవిభాగం, ఏయూ
ప్రాక్టీస్పై దృష్టి సారించాలి
వివిధ సెట్లకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు ప్రాక్టీస్పై దృష్టి సారించాలి. దీనివల్ల వేగం, కచ్చితత్వం వస్తుంది. ప్రస్తుతం సెట్లన్నీ ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తున్నారు. వీటిపై ప్రతీ విద్యార్థికి అవగాహన కలిగి ఉండాలి. సాధారణంగా నిర్వహించే పరీక్షలకు ఇవి కొంత భిన్నంగా ఉంటాయి. సమాధానం గుర్తించే సమయంలో సరిచూసుకోవడం ఎంతో ముఖ్యం. సిలబస్లో ప్రాథమిక అంశాలపై పూర్తి స్థాయిలో పట్టు సాధించాల్సిన అవసరం ఉంది.
–ఆచార్య వై.అబ్బులు, చీఫ్, ఏయూ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ గైడెన్స్ బ్యూరో