7 గదులు..300 ఉద్యోగులు
కృష్ణా పుష్కరాలకు పక్కా ఏర్పాట్లు పూర్తిచేశామని అధికారులు ఊదరగొడుతున్నప్పటికీ పుష్కర విధుల కోసం వచ్చిన ఉద్యోగులకు వసతి కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారు.
సాక్షి, అమరావతి :
కృష్ణా పుష్కరాలకు పక్కా ఏర్పాట్లు పూర్తిచేశామని అధికారులు ఊదరగొడుతున్నప్పటికీ పుష్కర విధుల కోసం వచ్చిన ఉద్యోగులకు వసతి కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులు సరైన వసతి లేక అవస్థలుపడుతున్నారు. పుష్కర విధుల్లో భాగంగా నెల్లూరు,ప్రకాశం,అద్దంకి, మార్కాపురం డిపోల నుంచి 300 వందల మందికి పైగా ఆర్టీసి డ్రైవర్లు వచ్చారు. వారికి గుంటూరుజిల్లా మంగళగిరిలోని చింతక్రింది కనకయ్య ప్రవేటు హైస్కూల్ లో వసతి ఏర్పాట్లు చేశారు. కానీ అక్కడకు వెళ్లిన ఆర్టీసీ సిబ్బంది అవస్థలు వర్ణాతీతంగా ఉన్నాయి. ఏడు గదులు ఇచ్చి, అందులో మూడు వందలమంది సర్ధుకుపోవాలని చెప్పారు. అంతేకాదు నీళ్ల సదుపాయం లేదు.
బాత్రూమ్లో నీరు లేక స్నానాలు చేయలేకపోయారు. తాగునీరు వసతికూడా అంతంత మాత్రమే.ఇరవై మందికి ఒక బకెట్ ఇచ్చి దాంతోనే సర్ధుకుపోవాలని చెప్పడంతో వారు ఇబ్బంది పడుతున్నారు. బుధవారం రాత్రికి విద్యుత్ సౌకర్యం కల్పించలేకపోయారు దీంతో ఫ్యాన్లు లేక దోమల బెడదతో నరకయాతన అనుభవించారు. పడుకునేందుకు చాపలు లేవు ,గదుల్లో స్కూల్ బల్లలు అలానే ఉంచడంతో అక్కడ పడుకునేందుకు వీలులేక ఇబ్బందిపడ్డారు.
అధికారుల నిర్లక్ష్యం వల్లే
అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కన్పిస్తుంది.ఉద్యోగులు రాక ముందే రెండు ముందే వసతి కల్పించే గృహసముదాయాన్ని స్వాధీనం చేసుకుని వసతులు కల్పించాల్సి ఉండగా అలాంటిదేమీ చేయలేదు. ఇలాంటి దుస్థితి ఏవరికి రాకూడదనీ, విధులు నిర్వహంచి కాసేపు సేదతీరదామనుకొనే వాతావరణం ఇక్కడ లేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.