బిడ్డలు పుట్టేందుకు మందు ఇస్తామని మోసం


రామచంద్రాపురం(కమలాపురం): బిడ్డలు పుట్టేందుకు మందు ఇస్తామని చెప్పి దంపతులను మోసం చేసిన ఘటన కమలాపురం మండలం రామచంద్రాపురంలో మంగళవారం చోటు చేసుకుంది. 108 సిబ్బంది తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని రామచంద్రాపురానికి చెందిన ప్రేమకుమారి, దానమయ్యలకు రెండేళ్ల క్రితం వివాహమైంది. అయితే ఇంత వరకు వారికి సంతానం కలగ లేదు. మంగళవారం గుర్తు తెలియని ఒక మహిళ, ఒక పురుషుడు గ్రామంలోకి వచ్చి బిడ్డలు పుట్టేందుకు నాటు మందు ఇస్తామని ప్రచారం చేసుకుంటూ వెళ్లారు. దీంతో బిడ్డలపై మమకారం పెంచుకున్న ప్రేమకుమారి వారిని పిలిచి మందు ఇవ్వాలని కోరింది. రు.3500 తీసుకుని వారు నాటు మందు ప్రేమ కుమారి ఇంట్లోనే తయారు చేసి ఇచ్చారు. ఆ మందు తాగిన అర గంట నుంచి ప్రేమకుమారికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. దీంతో 108 వాహనంలో చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. ఇరుగు పొరుగు వారు తేరుకొని చూసే సరికి మందు ఇచ్చిన వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, బాధితురాలు రిమ్స్‌లో ఫిర్యాదు చేస్తే అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి తమకు బదిలీ చేస్తారని తెలిపారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top