దీపావళి రోజు తీరం దాటనున్న 'క్యాంట్'! | Cyclonic storm Kyant may head towards Andhra coast in diwali | Sakshi
Sakshi News home page

దీపావళి రోజు తీరం దాటనున్న 'క్యాంట్'!

Oct 26 2016 2:03 PM | Updated on Jun 2 2018 2:53 PM

క్యాంట్ తుపాను దీపావళి రోజున తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

విశాఖ: బంగాళాఖాతంలో ఏర్పడ్డ క్యాంట్ తుపాను దీపావళి రోజున తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు దిశగా కదులుతున్న ఈ తుపాను...చెన్నై- మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది.  ఈ తుపాను విశాఖకు తూర్పు ఆగ్నేయంగా 570 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, పశ్చిమ బంగాళాఖలంలోకి రేపు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో కోస్తా తీరం వెంబడి ఉత్తర దిశగా గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

మరోవైపు క్యాంట్ తుపానుపై విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ బుధవారం సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 11 తీరప్రాంత మండలాలను అప్రమత్తం చేశామని, కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తామన్నారు. కలెక్టరేట్లో 180042500009 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందం విశాఖ చేరుకుందని, అలాగే 20 బోట్లు, రెస్క్యూ టీమ్లు ఏర్పాటు చేయాలని నేవీని కోరినట్లు చెప్పారు. పారాదీప్ వద్ద చిక్కుకున్న 60-70 బోట్లకు అక్కడే లంగర్ వేసే అవకాశం కల్పించాలని, పారదీప్ అధికారులను కోరుతున్నామన్నారు. అలాగే తుపాను దృష్ట్యా అధికారులకు సెలవులు రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement